సార్వత్రిక ఎన్నికలకు ముందే టీడీపీని ఓటమి పలకరించింది. ప్రజలల్లో ఓ బలమైన వర్గం ఆ పార్టీకి దూరంగా జరిగినట్లుగా స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఇక మిగిలిన వర్గాలు కూడా ప్రభుత్వం తీరుపై ఈ మధ్య గుర్రుగా ఉన్నాయని వస్తున్న వార్తలకు బలం చేర్కూర్చేలా దీన్ని చూస్తున్నారు. 


విషయానికి వస్తే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మద్దతుతో పోటీచేసిన గాదె శ్రీనివాసులు నాయుడు ఓటమి చెందారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిచిన గాదె శ్రీనివాసుల నాయుడుపై   ఏపీటీఎఫ్, ఇతర వామ‌పక్ష ఉపాధ్యాయ  సంఘాలు బలపరచిన పాకలపాటి రఘు వర్మ విజయం సాధించారు. మొత్తం ఓట్లలో రఘు వర్మకు 7834 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా.. గాదె శ్రీనివాసులునాయుడుకు 5632 మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రమే వచ్చాయి.మరో అభ్యర్థి అడారి కిషోర్‌ కుమార్‌కు 2548 ఓట్లు పడ్డాయి. ఎవరికీ కోటా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వచ్చింది. రెండో ప్రాధాన్యత ఓట్లలో రఘు వర్మకు ఎక్కువ రావడంతో ఆయన విజయం సాధించారు.


ఇదిలా ఉండగా టీడీపీ పెద్దలతో రాసుకుపూసుకు  తిరిగిన శ్రీనివాసులునాయుడు ఓటమి దేనికి సంకేతమని పార్టీలోనూ చర్చ సాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీ పట్ల కొంత వ్యతిరేకంగా  ఉన్నారని జరుగుతున్న ప్రచారానికి ఇది బలాన్ని ఇచ్చేలా ఉంది. అలాగే, ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. దానిపైన కూడా వ్యతిరేకత ఉండడం టీడీపీ బలపరచిన అభ్యర్ధి పరాజయానికి కారణమని విశ్లేషిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: