ఎన్నికల సందర్భంగా అనేకానేక చిత్రాలు చోటు చేసుకునే సంగతి తెలిసిందే. ఒకే కుటుంబంలో అన్నాదమ్ములు పోటీచేయడం, అక్కాచెల్లెళ్లు బరిలో దిగడం, వీరిలో ఒకరిపై మరొకరు పోటీ చేయడం వంటి ప్రచార పదనిసలు ఎన్నో ఉంటాయి. అయితే, తాజాగా ఇంకో చిత్రం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ఒకే నియోజకవర్గంలో భార్యభర్తలు పోటీచేస్తున్నారు. అది కూడా ఒకరిపై మరొకరు బరిలో దిగుతున్నారు. ఈ చిత్రం కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఈ నియోజకవర్గం నుంచి భార్యా భర్తలు సై అంటూ పోటీకి దిగి వార్తల్లోకి ఎక్కారు.
పెనమలూరులో తెదేపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బరిలో ఉన్నారు. వైసీపీ తరుపున అభ్యర్థిగా మాజీ మంత్రి కొలుసు పార్థసారథి పోటీ చేస్తున్నారు. ఆయన సతీమణి కమల ఇండిపెండెంట్గా బరిలో ఉన్నారు. వీరి కుమారుడు నితిన్ కృష్ణ దాఖలు చేసిన నామినేషన్ను పరిశీలనలో తొలగించారు. తాజాగా, పార్థసారథికి ఫ్యాన్ గుర్తును కేటాయించగా.. కమలకు బెల్టు గుర్తు కేటాయించారు. అయితే ఒకే నియోజకవర్గంలో భార్యాభర్తలు పోటీలో నిలవడం చర్చనీయాంశంగా మారింది.
పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ పోటీ ప్రధానంగా వైసీపీ, టీడీపీల మధ్యే ఉంది. నామినేషన్ దాఖలు సమయంలో అంటే దరఖాస్తు సహేతుకమే కానీ...అనంతరం కూడా భార్యభర్తలు ఇద్దరు రంగంలో ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.