నారావారి సుపుత్రుడు నారా
లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ సర్వీస్ ట్యాక్స్ పేరుతో
బారీగా డబ్బు వసూళ్ళు మొదలైందట. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి
నియోజకవర్గాల్లో గడచిన ఐదేళ్లుగా కోడెల సర్వీసు ట్యాక్స్ మాత్రమే విన్నారు. కోడెల
సర్వీసు ట్యాక్స్ అంటే స్పీక్ కోడెల శివప్రసాద్ కొడుకు, కూతురు ఇద్దరూ వివిధ
రూపాల్లో భారీ ఎత్తున డబ్బులు వసూళ్ళు చేసేవారని వైసిపి నేతలతో పాటు స్ధానిక జనాలు
కూడా గగ్గోలు పెట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే.
పై రెండు నియోజకవర్గాల్లో వ్యాపారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు తదితర వర్గాల నుండి డబ్బు వసూళ్ళు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారట. ఆ వసూళ్ళనే ముద్దుగా అందరూ కోడెల సర్వీసు ట్యాక్స్ అని పిలుచుకునేవారు. అదే పద్దతి ఇపుడు మంగళగిరిలో కూడా మొదలైందట. మంగళగిరి అంటేనే రాజధాని అమరావతి ప్రాంతం ఉన్న నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. ఇక చెప్పేదేముంది ?
లోకేష్ పోటీని చూపించి మద్దతుదారులు, టిడిపి నేతలు లోకేష్ సర్వీస్ ట్యాక్స్ కు బహిరంగంగా తెరలేపారని ఆరోపణలు పెరిగిపోతున్నాయ్. ఎన్నికల్లో ఖర్చుల కోసం పాపం లోకేష్ దగ్గర డబ్బులు లేవట. అందుకనే వసూళ్ళకు తెరలేపారు. బిల్డర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, వర్తకులతో పాటు ఇతర వ్యాపార రంగాల్లోని ప్రముఖులకు ఫోన్లు చేసి మరీ టార్గెట్లు ఫిక్స్ చేస్తున్నారట.
వ్యాపారి, రియాల్టర్ తదితరుల స్ధాయిని బట్టి రూ 5 లక్షల నుండి కోటి రూపాయల వరకూ వసూళ్ళ లక్ష్యంగా ఫోన్లు చేసి మరీ డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. లోకేష్ బాబు ఎన్నికల ఖర్చు మొత్తం ఆయా గ్రామాల పరిధిలోకి వచ్చే వర్తక, వ్యాపార రంగాల్లోని వారే భరించాలంటూ షరుతులు కూడా విధిస్తున్నారట. అంటే దీపం ఉన్నపుడు ఇల్లు చక్కపెట్టుకునే పనిలో పడ్డారు చినబాబు అనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.