తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. తెలంగాణలో మహా కూటమి ఓటమితో తెలంగాణకు చంద్రబాబు అనే శని వదిలిపోయిందని అన్నారు. ఇక ఈ ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తే ఆంధ్రాకు పట్టిన శని కూడా వదిలిపోతుందని ఘాటుగా కామెంట్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని ఏపీ ప్రజలకు మోత్కుపల్లి సూచించారు. ఓట్ల కోసం 20 ఏళ్ల క్రితమే ఏబీసీడీ అంటూ దళితుల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టారని.. ఆ చిచ్చు ఇంకా చల్లారలేదని మోత్కుపల్లి మండిపడ్డారు. చంద్రబాబు మళ్లీ గెలుస్తానన్న నమ్మకం లేక.. పాలన చివర్లో సంక్షేమ పథకాలు హడావిడిగా అమలు చేశారని విమర్శించారు.
జగన్ నవరత్నాలు ప్రకటించగానే.. వాటి కాపీ కొట్టడానికి సిగ్గులేదా అంటూ చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేశారు. చంద్రబాబును నమ్మి సర్వం కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2008-2012 మధ్య కాలంలో చంద్రబాబుకు కాపలా కుక్కలా ఉన్నా. ఆయన కోసం దెబ్బలు తిన్నా. అయినా.. నా వెంట ఆయన ఉంటారని నమ్మా. కానీ ఆయన నన్నే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని గుర్తు చేసుకున్నారు.
చంద్రబాబు రేవంత్ రెడ్డి కూతురు పెళ్లిని చంద్రబాబు దగ్గరుండి చేయించారని, కానీ తన బిడ్డ పెళ్లికి ఎప్పుడో 4 గంటలకు వచ్చారని మోత్కుపల్లి అన్నారు. రేవంత్ రెడ్డిని చంద్రబాబు నమ్మారు.. ఏమైంది? ఆయన పార్టీని సర్వనాశనం చేశారు. రేవంత్ కు వ్యతిరేకంగా నోరు విప్పినందుకు నన్ను పక్కనపెట్టారని మోత్కుపల్లి గుర్తు చేసుకున్నారు. ఏపీలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు.