టీడీపీలో సీనియర్ నాయకుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర మంత్రి, దళిత నాయకుడు నక్కా ఆనందబాబుకు ఇప్పుడు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? వరుస విజయాలతో దూసుకుపోయి.. మూడోసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ దిశగా దూసుకుపోదా మని భావించి న ఆయనకు ప్రజల నుంచి వ్యతిరేకత కనిపిస్తోందా? అంటే... ఎన్నికల తాజా పరిణామాలను విశ్లేషిస్తే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గుంటూరు జిల్లాలోని మేమూరు నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధించారు మాదిగ సామాజిక వర్గానికి చెందినమంత్రి నక్కా ఆనందబాబు. 2009లో వైఎస్ గాలులు భారీగా వీచినా.. 2000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఇక, 2014లోనూ 2000 ఓట్ల మెజారిటీ తోనే ఆయన వైసీపీ నాయకుడు ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన మేరుగ నాగార్జునపై విజయం సాధించారు.
2017లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో చంద్రబాబు.. నక్కాకు మంత్రి పదవి ఇచ్చారు. ఇక, ఇప్పుడు మరోసారి ఆయనకే వేమూరు టికెట్ను కేటాయించారు. ఇక, వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు మేరుగ నాగార్జున పోటీ చేస్తున్నారు. వాస్తవానికి గత రెండుసార్లు గా ఓటమి పాలవుతున్నా.. మేరుగ మాత్రం ప్రజల్లోనే ఉంటున్నారు. ఇప్పుడు ఈపరిణామం ఆయనకు కలిసి వస్తోంది. ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకోవడం గత ఏడాది నియోజకవర్గంలో జగన్ పాదయాత్రకు సంఘీబావంగా పాదయాత్ర నిర్వహించడం వంటివి ఆయనకు కలిసి వస్తున్నా యి. ఇక, ఇక్కడ నుంచి వరుస విజయాలు సాధించి, మంత్రి పదవిని చేపట్టినా.. ఆశించిన స్థాయిలో ఇక్కడ మంత్రి నక్కా అభివృద్ధిని పరుగులు పెట్టించలేక పోయారు. పైగా గడిచిన పదేళ్లుగా ఆయన ఇక్కడ ప్రత్యేకంగా చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేక పోవడం కూడా గమనార్హం.
అదేసమయంలో అవినీతి ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. పార్టీ కార్యకర్తల్లోనూ నిరుత్సాహం.. తమకు ఏమీ చేయలేదన్న భావన వెరసి మొ త్తంగా నక్కాకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అయితే, సామాజిక వర్గంలో వచ్చిన చీలిక మాత్రం నక్కాకు అనుకూలంగా ఉంది. మొత్తానికి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు నాయకులు కూడా హోరా హోరీగా పోరాడుతున్నారు. ప్రబుత్వం ప్రవేశ పెట్టిన, అమలు చేస్తున్న పథకాలు తనకు శ్రీరామ రక్షగా మారుతాయని మంత్రి నక్కా భావిస్తున్నారు. కొన్ని మండలాల్లో స్థానిక సమస్యల కారణంగా అభివృద్ధి జరగని మాట వాస్తవమేనని ఒప్పుకొంటున్నారు. ఇక, మేరుగ నాగార్జున కూడా భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ నవరత్నాలు, జగన్ పాలన వంటివాటిని వివరిస్తున్నారు. వీటికితోడు.. రెండు సార్లుగా ఓటమి పాలయ్యాడనే సానుభూతి మేరుగకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.