భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ — ISRO) సిద్ధమైంది. నెల్లూరు జిల్లా షార్లోని రెండో ప్రయోగ వేదికపై ఒక స్వదేశీ, 28 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్ఎల్వీ—సీ45 సోమవారం ఉదయం 9.27కి నింగిలోకి పంపారు. ఇప్పటికే షార్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రయోగం కోసం ఆదివారం ఉదయం 6.27 గంటల నుంచి కౌంట్ డౌన్ మొదలైంది. కాగా, పీఎస్ఎల్వీ పరంపరలో ఇది 47వ ప్రయోగం.
ఈ రాకెట్కు శాస్త్రవేత్తలు ప్రీ కౌంట్డౌన్, ప్రయోగ రిహార్సల్స్ చేశారు. షార్ డైరెక్టర్ పాండియన్ అధ్యక్షతన లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై రాకెట్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రాకెట్ ద్వారా డీఆర్డీవో రూపొందించిన 436 కేజీల ఈఎంఐ శాటిలైట్ను నింగిలో 749 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 98 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టబోతున్నారు. ఇది దేశ రక్షణ రంగానికి ఉపయోగపడనుంది. రేడియో అమెచ్యూర్ శాటిలైట్ కార్పొరేషన్ రూపొందించిన ఆటోమ్యాటిక్ పాకెట్ రిపెరింగ్ సిస్టమ్ రేడియో తరంగాల సమాచారాన్ని తెలపనుంది.
రాకెట్ ప్రయోగం ఇస్రో చైర్మన్ కె.శివన్ పర్యవేక్షణలో జరగనుంది. ఇందుకు సంబంధించి శాస్త్రవేత్తలు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ ప్రయోగం ద్వారా మనదేశానికి చెందిన ఎమిశాట్ (ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మెజర్ మెంట్) ఉపగ్రహంతో పాటు ఇతర దేశాలకు చెందిన మరో 28 నానో ఉపగ్రహాలను కూడా పలు కక్ష్యల్లో ప్రవేశపెడతారు.