మమతను తీసుకొచ్చి చంద్రబాబు రాజకీయ తెరచెయ్యాలనుకున్నాడు. కాని మమత దీదీ అసాధ్యురాలు మొత్తం తెలుగుదేశం ఎన్నికల సభను తన ప్రయోజనాలకు తనవైపుకు తిప్పుకున్నారు. విశాఖలో సభ అన్నది టీడీపీకి ఒక సెంటిమెంట్. సరిగ్గా అయిదేళ్ళ క్రితం చంద్రబాబు, నద్రంద్రమోడీ, పవన్ కళ్యాణ్ విశాఖలో భారీసభ పెట్టి మాది అభివృధ్ధి జోడీ అంటూ ఊదరగొట్టారు. అప్పట్లో నరేంద్ర మోడీ వేవ్, పవన్ క్రేజ్, బాబు అనుభవం కార్డ్ - అన్నీకలసి టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచేశాయి. అధికారంలోకి తీసుకువచ్చేశాయి.
మరో మారు ఆ సెంటిమెంట్ నే నమ్ముకున్న చంద్రబాబు ఈసారి కుడి ఎడమల పాత్రధారులను మార్చి విశాఖలో మీటింగ్ పెట్టారు. ఒకవైపు డిల్లీ సీఎం, మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తోడు గా విశాఖలో తన ఇమేజ్ పెంచుకోవాలనుకున్నారు. ఈ దెబ్బతో టీడీపీ పరుగులు తీయాలనుకున్నారు. అయితే చివరికి అది ఒక ఫ్లాప్ షోగా మిగిలిపోయింది. ఇక విశాఖ సభను మమత బాగా ఉపయోగించుకున్నారు. తానొక జాతీయ నాయకులురాలిగా భావిస్తూ ఆమె మోడీపై మాటలతో అటాక్ చేశారు. ఆమె మొత్తం ప్రసంగం అంతా మోడీని టార్గెట్ చేస్తూ సాగింది. మోడీ ఈసారి గెలవడు, మనదే డిల్లీ రాజ్యం అంటూ మమత చెప్పిన ఉపన్యాసం చంద్రబాబుకే కాదు. అక్కడ చేరిన తమ్ముళ్లకూ నిరాశ కలిగించింది.
ఇక ఏపీలో పొలిటికల్ సీన్ గురించి మమత ఒక్కమాటకూడా మాట్లాడకపోవడంతో చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చిందనే చెప్పాలి. చంద్రబాబుదే మళ్ళే పవర్ అన్నమాట మమత నోట రాకపోవడం విడ్డూరమే. అలాగే, జగన్ గురించి కనీసం విమర్శ చేయకపోవడంతో పసుపు పార్టీకి నీరసం వచ్చింది. ఎంతసేపు నరేంద్ర మోడీతో ఢీకొట్టేది తానేనంటూ మమత చేసిన గర్జనతో అది చంద్రబాబుకు మద్దతు మీటింగా లేక మమతను ఫోకస్ చేసే సభా అన్నది టీడీపీకే అర్ధంకాని పరిస్థితి.
ఇక చంద్రబాబు సైతం జాతీయ రాజకీయాల గురించి మాట్లాడాల్సి వచ్చింది. నరేంద్ర మోడీని కేంద్రంలో ఓడిస్తామని మమత శుభవార్త చెప్పారు తమ్ముళ్ళూ అని చెప్పుకుని మురిసిపోవాల్సి వచ్చింది. నిజానికి ఏపీలో చంద్రబాబుని మళ్ళీ గెలిపిస్తామని మమత చెప్పాల్సి వుండగా అది జరగలేదు సరికదా! జగన్ మీద పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇక సభకు వచ్చిన జనం చూస్తే తమ్ముళ్ళు బుర్ర గోక్కోవాల్సి వచ్చింది. అప్పట్లో నరేంద్ర మోడీ వేవ్ ఉండడం, పవన్ కళ్యాణ్ క్రేజ్ తో స్టేడియం మొత్తం నిండిపోగా ఈసారి సగానికి సగం ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఆదివారం, విశాఖలోని జనమంతా వస్తారనుకున్నా ఎవరూ రాకపోవడంతో చప్పగా సభ ముగిసింది. మొత్తానికి ఈసారి సభ టీడీపీ గ్రాఫ్ ని పెంచకపోగా మరింత నిరాశను పెంచిందని తమ్ముళ్ళు గొణుక్కుంటున్నారు.
జనసేన అధినేత పవన్కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, బాటలోనే నడవబోతున్నారు. ఆయన కోసం మమత.. ఈయనకి మాయ అన్నట్లుంది వ్యవహారం. 'అబ్బే, మాకూ టీడీపీకీ పొత్తు లేదు' అని పవన్కళ్యాణ్ పదే పదే చెబుతున్నా, ఆయనగారి విధానాలు ప్రవర్తన చూస్తే మాత్రం, తెలుగుదేశం పార్టీకి సమాంతరంగా కొనసాగుతున్న విషయం జనానికి అర్థమవుతోంది.
తెలుగుదేశం పార్టీ తరఫున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంద్ర బాబు ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చిన విషయం విదితమే.ఈ కోవలోనే జనసేనాని పవన్కళ్యాణ్ కూడా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి తీసుకొస్తున్నారు. చిత్రమేంటంటే, జనసేన పార్టీ తరఫున మాయావతి ఆంధ్రప్రదేశ్ తో పాటు, తెలంగాణ లోనూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారట.
జనసేన-బీఎస్పీతో పాటు వామపక్షాలు కలిసి ఒక కూటమిగా ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తోన్న విషయం విదితమే. అయినాగానీ, మాయావతి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటే, జనసేన పార్టీకి కాస్తంతైనా లాభిస్తుందా.? ఏమో, మరి ఆ సంగతి పవన్కళ్యాణ్కే తెలియాలి. మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆఖరికి చెప్పులను కొనుక్కునేందుకు ప్రత్యేక విమానాల్ని వినియోగించారంటూ మాయావతిపై ఆరోపణ లు వెల్లువెత్తాయి. అలాంటి మాయావతిని తీసుకొచ్చి 'క్లీన్ పాలిటిక్స్' చేస్తానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఓటర్లను ఎలా మభ్యపెట్టగలరట.?