ఇటీవలి కాలంలో సినీనటి, టీడీపీ నేత దివ్యవాణి విపరీత వ్యాఖ్యలకు పెట్టింది పేరుగా నిలిచారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ తరఫున కామెంట్లకు తప్పేమి లేనప్పటికీ....ఆమె వ్యక్తిగతంగా కూడా ఒకింత పరుషమైన పదాలతో విమర్శలు గుప్పిస్తారనే టాక్ ఉంది. ఇదే రీతిలో ఇటీవల సినీ నటుడు ఆలీపై ఆమె ఘాటు విమర్శలు చేసింది. ప్యాకేజీలిస్తే వైసీపీలోకి వెళ్లాంరటూ ఆరోపించింది. దీనిపై ఆలీ ఘాటుగా స్పందించారు.
ప్యాకేజీలిస్తే వైసీపీలోకి వెళ్లారంటూ దివ్యవాణి చేసిన వ్యాఖ్యలపై నటుడు ఆలీ కౌంటర్ అటాక్ ఇచ్చారు. ప్యాకేజీలు ఇస్తేనే పార్టీలో చేరామని మాపై ఆరోపణలు చేస్తున్న దివ్యవాణి ఏమైనా తొంగి చూసిందా..? లేక సెల్ఫీలు ఏమైనా తీశారా..? అంటూ విమర్శించారు. దివ్యవాణికి ఎంత ప్యాకేజీ అందితే.. టీడీపీలోకి వెళ్లిందో చెప్పాలి అని ఆలీ ప్రశ్నించారు. వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి, జగన్లతొ ఉన్నఅనుబంధంతోనే తాను వైసీపీలో చేరానని ఆలీ అన్నారు. వివిధ భాషల్లో తాను 11 వందలకు పైగా సినిమాల్లో నటించానన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా తనను గుర్తిస్తారన్నారు. ఏపీ దాటితే దివ్యవాణిని ఎవరూ గుర్తు పట్టరని ఎద్దేవా చేశారు.
కాగా, మరోమారు సినీ నటులపై చంద్రబాబు విమర్శలు చేశారు. హైదరాబాద్ నుంచి వలస పక్షులు వచ్చారని, వారందరినీ కేసీఆర్ బెదిరించి పంపిస్తున్నారని ఆరోపించారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తనను తిడుతున్నారని అన్నారు. ఎవరీ మోహన్ బాబు, ఎవరీ జయసుధ, ఎవరీ ఆలీ అని చంద్రబాబు ప్రశ్నించారు. కేసీఆర్కు ఊడిగం చేస్తానంటే చేయండి, అంతే కానీ ఇక్కడికొచ్చి తమపై పెత్తనం చేయొద్దని హెచ్చరించారు.