ఏపీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ దూసుకుపోతున్నారు. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ అలరిస్తున్నారు. నవరత్నాల పథకాల వివరాలు చెబుతూ జనంలో అంచనాలు పెంచుతున్నారు.
ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదే అన్న ధీమా వైసీపీ వర్గాల్లో పెరుగుతోంది. అందుకే జగన్ అవకాశాన్ని బట్టి సంచలన ప్రకటనలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న గుంటూరు జిల్లాలో మొదటి మంత్రిని ప్రకటించిన జగన్ ఇప్పుడు ప్రకాశం జిల్లాలో రెండో మంత్రిని ప్రకటించారు.
ఈసారి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి బరిలో దిగిన ఆయన బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రిగా ప్రకటించేశారు. వాసన్న మంచివాడు.. సౌమ్యుడు.. మీ అందరికీ మేలు చేస్తాడు.. మంచి మెజారిటీతో గెలిపించండి.. మంత్రిని చేసి మీ ముందు ఉంచుతాను అని ప్రకటించేశారు జగన్.
అదే సమయంలో అదే వేదికపై ఉన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా ప్రజలకు పరిచయం చేశారు. శీనన్న మంచివాడు, సౌమ్యుుడు అంటూ మెచ్చుకున్నారు. ఇటీవల వైసీపీ ఫ్యాన్ గుర్తుపై గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్న తీరును అర్థం చేసుకున్న జగన్.. ఫ్యాన్ గుర్తును ప్రతిచోటా ప్రచారం చేస్తున్నారు