బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో జనసేనతో బీఎస్పీ పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో మాయావతి రాష్ట్ర పర్యటనకు వచ్చారు. విశాఖలోని సాయిప్రియ రిసార్ట్స్ లో బిఎస్పీ అధినేత్రి మాయావతి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాయవతి పేర్కొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన-బీఎస్పీ-సిపిఐ-సిపిఎంలతో కూడిన కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కానున్నారని మాయావతి జోస్యం చెప్పారు. లోక్ సభ, శాసనసభ రెండింట్లోనూ ఈ కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించారు. "ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కాలం కాంగ్రెస్ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరగకపోవడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి తగిన న్యాయం జరగలేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. ఏపీకిచ్చిన హామీలను ప్రధాని మోదీ నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్, బీజేపీలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.`` అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో దళితులు, వెనకబడిన వర్గాలవారు ఎక్కువగా ఉన్నారని, వీరు చంద్రబాబు, జగన్ వలలో పడవద్దని మాయావతి కోరారు. ``ఏపీ ప్రజలు కొత్త నాయకత్వాన్ని ఆదరించాలి. ఇప్పుడున్న రాజకీయ పక్షాలలో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన మంచి ప్రత్యామ్నాయం. పవన్ కళ్యాణ్ వంటి యువ నాయకత్వంలో ప్రభుత్వం వస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. పవన్ కల్యాణ్తో పాటు బీఎస్పీ, వామపక్షాలు కలిసి పనిచేస్తున్నాయి. మా కూటమికి సంపూర్ణ మద్దతు లభిస్తుందని భావిస్తున్నాం. మా కూటమికి సంపూర్ణ మద్దతు లభిస్తుందని భావిస్తున్నాం" అన్నారు.