ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే టైం ఉంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ తరపున వివిధ నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తోన్న అభ్యర్థుల ఇళ్లపై ఐటీ పంజా విసురుతోంది. ఎన్నికల్లో భారీగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసేందుకు వారు రెడీ అవుతున్నారన్న సమాచారంతో ఐటీ చేస్తోన్న దాడులతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. టీడీపీ నేతల సంస్థలు, కార్యాలయాలు, ఇళ్లల్లో ఐటీ దాడులు జరుగుతుండటం విశేషం. కొద్ది రోజుల క్రితం టిడిపి నుండి కనిగిరి అసెంబ్లీ అభ్యర్దిగా బరిలో ఉన్న ఉగ్ర నరసింహారెడ్డి కి చెందిన ఆస్పత్రి పై రెండు రోజుల పాటు ఐటి దాడులు జరిగాయి. చంద్రబాబు క్యాబినెట్ లో కీలక మంత్రిగా పని చేసిన నారాయణ సంస్థల పైనా ఐటి దాడులు జరిగాయి. నారాయణ నివాసంతో పాటుగా ఆయనకు చెందిన మెడికల్ కళాశాల పైనా దాడులు కొనసాగాయి.
అంతకు ముందు టిడిపి నేతగా ఉన్న ప్రస్తుత నెల్లూరు ఎంపి అభ్యర్ది బీదా మస్తాన రావు సంస్థల మీద ఐటి దాడులు జరిగాయి. తాజాగా టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో కడప జిల్లా మైదుకూరు నుండి పోటీ చేస్తున్న టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పై ఐటి దాడులు జరుగుతున్నాయి. ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న జాతీయ హోదా దక్కించుకున్న పోలవరం ప్రాజెక్ట్ పనులకు ఆయన సబ్ కాంట్రాక్టర్గా వ్యవహరిస్తున్నారని జగన్ తరుచూ ఆరోపిస్తూ వస్తున్నారు. నిజానికి ఆయన కాంట్రాక్టర్ పనులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటు తెలంగాణలో..అటు ఆంధ్రప్రదేశ్లో వివిధ నిర్మాణ పనులకు కూడా ఆయన కాంట్రాక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు....తెలంగాణ రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస యాదవ్లకు సుధాకర్ వియ్యంకుడు కావడం గమనార్హం. సోదాల్లో ఇప్పటి వరకు అధికారులకు ఏం లభించలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు టీడీపీ నేతలపై జరిగిన దాడుల్లో ఐటీ అధికారులకు చిక్కిదేమీ లేదని తెలుస్తోంది. కొండను తవ్వి ఎలుకనైనా పట్టలేదని ఇటీవల మంత్రి నారాయణ ఘాటైనా విమర్శలు చేశారు. ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారంతో తమను రాజకీయంగా, పరువు ప్రతిష్ఠలను దెబ్బతీయడానికే ఇలా వరుసగా నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కేంద్రం, వైసీపీ వైఖరిలు టీడీపీకి అనుకూలంగా మారుతోందని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లోనే మరి కొందరు టిడిపి నేతలే లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందని టిడిపి నేతలు అంచనా వేస్తున్నా రు. కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని వ్యాపార రంగంలో ఉన్న టిడిపి అభ్యర్దులే లక్ష్యంగా రానున్న మూడు నాలు గు రోజుల్లో ఐటి దాడులు జరిగే అవకాశం ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. చూడాలి ఏం జరుగుతుందో..!