ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్తో దోస్తీ కట్టి ముందుకు సాగుతున్న అసద్ తాజాగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పట్ల తన అభిమానాన్ని ఓ రేంజ్లో చాటుకున్నారు. తాను మరణించే వరకు కేసీఆర్తోనే ఉంటానని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. వికారాబాద్లో నిర్వహించిన సభలో ఓవైసీ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఎంపీ ఎన్నికల్లో భాగంగా, టీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా ఓవైసీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో ఓవైసీ మాట్లాడుతూ....``వేరే రాష్ట్రాలలో ముస్లింలపై అరాచకాలు, దాడులు జరుగుతున్నాయి. మన తెలంగాణ రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది. అందుకే కేసీఆర్కు సపోర్ట్ చేస్తున్నాం. నేను చనిపోయే వరకు కేసీఆర్కు సపోర్ట్ చేస్తా`` అని ఓవైసీ ప్రకటించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వండి అని ఓవైసీ ముస్లింలకు పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి నాన్ లోకల్ అంటే రాహుల్ గాంధీ కూడా నాన్ లోకలేనని ఓవైసీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి మత్స్యకారుల నోరు కొడుతున్నాడని ఓవైసీ ఆరోపించారు. విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి మోసం చేశాడని మండిపడ్డారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి చాలా మంచి పని చేశాడని ఓవైసీ అభినందించారు, కాంగ్రెస్ను వీడినందుకే ఏపీకి సీఎం కాబోతున్నాడన్నారు. ప్రధాని మోదీ కులాలను మతాలను విడదీస్తున్నారని, తాను ఉన్నంతకాలం బీజేపీతో ఫైట్ చేస్తూనే ఉంటానన్నారు.