తెలుగుదేశం పార్టీ నాయకుడు సినీ నటుడు రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు జయభేరి సంస్థల అధినేత మాగంటి మురళీమోహన్పై సైబరాబాద్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 171(బి), 171(సి), 171(ఈ),171(ఎఫ్)ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం పోలీసుల తనిఖీల్లో దొరికిన ₹ 2 కోట్లకు సంబంధించి మురళీమోహన్ తో పాటు మరో ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
గచ్చిబౌలి జయభేరి కార్యాలయం నుంచి రెండు బ్యాగుల్లో డబ్బులతో ఆటోలో హైటెక్సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో ట్రైన్ దిగి ఇద్దరు వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేయగా దొరికిపోయారని తెలిపారు. జయభేరి ఉద్యోగులు కాకినాడ వాసి నిమ్మాలూరి శ్రీహరి, మెదక్ జిల్లా వాసి అవుటు పండరీలను అదుపులోకి తీసుకుని విచారించగా రాజమండ్రి లోక్సభ ఎన్నికల్లో ఓటర్ల కు పంచేందుకు తీసుకెళ్తున్నట్లు అంగీకరించినట్లు చెప్పారు. జయభేరి ప్రాపర్టీస్కి చెందిన ధర్మరాజు, జగన్మోహన్రావు ఆదేశాల మేరకు అదే కార్యాలయంలో ఆఫీసు అసిస్టెంట్ లుగా పనిచేసే శ్రీహరి, పండరీలు రెండు బ్యాగుల్లో ₹2 కోట్లు తీసుకుని హైటెక్సిటీ రైల్వేస్టేషన్కు బయల్దేరారు.
కారులో వెళ్తే తనిఖీలు చేస్తారనే ఉద్దేశంతో ఆటోలో వెళ్లారు. ఇటీవల రాజేంద్రనగర్ లోని ఆరాం-ఘర్ వద్ద బస్సులో ఏపీ టీడీపీ నేత పరిటాల సునీత అనుచరులు ₹28 లక్షలు తీసుకెళ్తూ పోలీసులకు దొరికారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులుపంచేందుకు ప్రజారవాణా వ్యవస్థను బాగా ఉపయోగించుకుంటున్నారని భావించి అన్ని రైల్వేస్టేషన్ల వద్ద తనిఖీలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు, మాదాపూర్ పోలీసులు బుధవారం తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కన్పించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఆటో దిగి ఆదరాబాదరాగా వెళ్తున్న వారిని ఆపి తనిఖీచేయగా రెండు బ్యాగుల్లో రూ.రెండు కోట్లు దొరికాయి. తాము జయభేరి ప్రాపర్టీ ఉద్యోగులమని వారు చెప్పినట్లు సమాచారం.
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ నుంచి ఎంఎంటీఎస్లో సికింద్రాబాద్కు చేరుకొని, అక్కడి నుంచి గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లో రాజమండ్రి వెళ్లాలని ధర్మరాజు, జగన్మోహన్రావు సూచించినట్లు ఇద్దరు నిందితులు శ్రీహరి, పండరీలు పోలీసు విచారణలో అంగీకరించారని కమీషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ తెలిపారు. రాజమండ్రి రైల్వే స్టేషన్కు చేరుకోగానే మురళీమోహన్ అనుచరుడు యలమంచి మురళీకృష్ణ కలుస్తాడని, తర్వాత ఆ డబ్బును రాజమండ్రి ఎంపీ మురళీమోహన్కు ఇవ్వాలని ఆదేశించినట్లు వారు వెల్లడించారని చెప్పారు.
ఈ డబ్బునే లోక్సభ ఎన్నికల్లో టీడీపీ తరఫు అభ్యర్థి మురళీ మోహన్ కోడలు రూప రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి టిడిపి అభ్యర్ధిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె తరపున నియోజకవర్గంలోని ఓటర్లకు పంపిణీ చేయాలని అనుకున్నట్లు వెల్లడించారు. వీరిద్దరు ఇచ్చిన వాంగ్మూలంతో ఎంపీ మురళీమోహన్, యలమంచి మురళీ కృష్ణ, ధర్మరాజు, జగన్మోహన రావులపై వివిధ ఐపీసీ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరి ఐదుగురిలో ఇద్దరు నిందితులు పోలీసుల అదుపు లో ఉండగా, మాగంటి మురళీమోహన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలిపారు. ఈ డబ్బును ఐటీ విభాగానికి అప్పగిస్తామని చెప్పారు.