బండ్ల గణేష్ గురించి పరిచయం అవసరం లేదు. సినీ రంగంలోని ప్రముఖ కమెడీయన్లలో ఆయన ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్లలో కూడా సుప్రసిద్ధుడు. కొద్దికాలం క్రింతం కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా కూడా అందరి చూపును బండ్ల గణేష్ తనవైపు తిప్పుకొన్నారు. అయితే, ఇలా పొలిటీషియన్గా మారిన బండ్ల గణేష్...తన పూర్వశ్రమం అయిన కామెడీని వదిలిపెట్టడం లేదా లేకపోతే...సరైన అవగాహన లేకపోవడం వల్ల అలా మాట్లాడుతున్నారో తెలియదు కానీ టీవీ ఛానల్ల డిస్కషన్లలో పాల్గొంటున్న ఆయన సదరు చర్చల్లో కూడా కామెడీ చేస్తున్నారని చర్చ జరిగింది. అలాంటి బండ్ల రాజకీయాలకు బైబై చెప్పేశారు.
దీనికి తోడుగా, బండ్ల సైతం అనేక సందర్భాల్లో కామెడీని పంచారు. కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే తాను గొంతు కోసుకుంటానని ప్రకటించారు. సెవెనో క్లాక్ బ్లేడ్తో తన వద్దకు రావాలని సవాల్ విసిరారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ వల్లే ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చేశారని సైతం మరో సందర్భంలో అన్నారు. హైదరాబాద్ నగరంలో గుంతలు గుర్తించిన వారికి వెయ్యి రూపాయల బహుమానం ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో మోడీ బెంబేలెత్తిపోయారని బండ్ల గణేష్ విశ్లేషించారు. వెయ్యి నోట్లన్నీ హైదరాబాద్కు తరలివెళ్తాయని భయపడిపోయిన మోడీ దాంతో నోట్ల రద్దు చేశారని లాజిక్ లేని సిల్లీ ప్రకటన చేశారు. దీంతో అవాక్కవడం, నవ్వుకోవడం యాంకర్ వంతు అయింది. కాగా, బండ్ల గణేష్ మాటలు యూట్యూబ్లో వైరల్ అయ్యాయి.
ఇదిలాఉండగా, తాజాగా బండ్ల గణేష్ రాజకీయాలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ``నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్గాంధీ, ఉత్తమ్కు కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు.`` అని ప్రకటించారు.