ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు వైసీపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే అనేక నియోజకవర్గాలలో ముఖ్యమైన పట్టణాలలో పర్యటించిన మోహన్ బాబు తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మోహన్బాబు మాట్లాడుతూ...అధికార పార్టీ టిడిపి రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి చేసిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు దోచుకో దాచుకో అన్నట్టుగా విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని గజదొంగల కంటే లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.


ఇసుక నుంచి బొగ్గు దాకా మరియు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన లక్షల కోట్లు చంద్రబాబు తన ఖజానాలోకి దారి మళ్ళించి దోచుకున్నారని విమర్శించారు. గత నాలుగు సంవత్సరాలు కేంద్రంతో చట్టాపట్టాలేసుకుని ఆంధ్ర ప్రజలను మోసం చేశారని...‘కొంతకాలం బీజేపీతో అంటకాగుతారు, మరికొంత కాలం కాంగ్రెస్‌తో జట్టుకడతారు. ప్రత్యేక హోదా సొమ్ము కాజేశాక బీజేపీకి రాంరాం చెప్పేశారు.


వారితో కలిసి ఉన్నప్పుడు కనిపించని ప్రత్యేక హోదా ఇప్పుడు కాంగ్రెస్‌తో జత కలిశాక కనిపిస్తోంది. ఇటువంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది’ అంటూ మోహన్‌బాబు హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబాన్ని సర్వ నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు.


గత సార్వత్రిక ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబు కి రాబోయే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు . ఇంకా మోహన్బాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జగన్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి మేలు చేయడానికి నవరత్నాలు ముందుకు తీసుకు వచ్చారని పేద ప్రజల పట్ల వైయస్ కుటుంబం ఎప్పుడూ మంచి చేయడానికి ఉంటుందని ముఖ్యంగా జగన్ అద్భుతమైన రాజకీయ నాయకుడని అభివర్ణించారు మోహన్ బాబు.



మరింత సమాచారం తెలుసుకోండి: