ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ముఖ్య పార్టీ నేతలు ఎన్ని రకాలుగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలో అన్ని రకాలుగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఒక పార్టీ తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారన్న విషయాలు క్రుడీకరించి మేనిఫెస్టో తయారు చేస్తారు. అందులో ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇస్తారు.
తాజాగా తెలుగువారి నూతన సంవత్సరాది అయిన ఉగాది పర్వదినాన కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుడుతూ.. నవయుగ సాకారానికి నాంది పలుకుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు.
ఈ సందర్బంగా ఆయన పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం మైనారిటీలకు ఎన్నో అద్భుత పథకాలకు శ్రీకారం చుట్టారు. మైనారిటీల సబ్ప్లాన్ను పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. ముస్లిం మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ కానుకగా రూ 1,00,000 ఇస్తాం, హజ్ యాత్రకు వెళ్లే ముస్లింకు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ముస్లీం మైనార్టీల్లో చాలా మంది నిరుపేదలు ఉన్నారని..అలాంటి వారికి సొంత అన్నలా, కొడుకులా ఆదుకుంటానని జగన్ హామీ ఇచ్చారు.