రాష్ట్రంలో హాట్ సీట్లలో గుంటూరు ఎంపీ సీటు ఒకటి.. ఎందుకంటే.. ఇక్కడ మూడు ప్రధాన పార్టీల తరపున పోటీకి దిగిన ముగ్గురూ.. కొన్ని నెలల క్రితం వరకూ ఒకే పార్టీలో ఉన్నారు. కలసిమెలిసే పనిచేశారు. సరిగ్గా ఎన్నికల ముందు ఇక్కడ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాలరెడ్డి వైసీపీలో చేరి గుంటూరు ఎంపీ నుంచి పోటీకి దిగారు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ జయదేవ్ ఉన్నారు. మోదుగుల వెళ్లిపోయాక ఏదో ఒక టికెట్ ఆశించిన బి. శ్రీనివాస్ ఏ టికెట్ రాకపోవడంతో జనసేనలో చేరారు.. గుంటూరు ఎంపీ నుంచి పోటీకి దిగారు.
ఈ ముగ్గురిలో ఇప్పుడు మోదుగుల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గల్లా జయదేవ్ ఈ ప్రాంతానికి విజిటింగ్ ప్రొఫెసర్ లా మారారంటూ మోదుగుల చేస్తున్న ప్రచారం జనంపై ప్రభావం చూపుతుంది. జయదేవ్ ఎప్పుడో ఓసారి నియోజకవర్గానికి రావడం మినహా చేసిందేమీలేదన్న ప్రచారం స్థానికంగానూ బలంగానే ఉంది.
పారిశ్రామికవేత్తగా.. ఎంపీగా ఎక్కువగా జయదేవ్ ఢిల్లీకే పరిమితం అయ్యారు. మరోవైపు జనసేన తరపున నిలుచున్న శ్రీనివాస్ గెలవకపోయినా 0 బీసీ ఓట్లు చీల్చే సత్తా ఉన్న నాయకుడు. ఇది జయదేవ్కు గట్టి దెబ్బగా మారే అవకాశం ఉంది. మొత్తం మీద గుంటూరు ఎంపీ స్థానంలో ఫ్యాన్ గాలి జోరుగానే వీస్తోందని చెప్పొచ్చు.