ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ముప్పేట అందరిదీ ఒక్కటే దాడి. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి చింతమేనని ప్రభాకర్ విషయం తరచుగా వార్తల్లోకి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుంచి వరుసగా మూడో సారి విజయం సాధించి రికార్డు సృష్టించాలని చూస్తున్నా.. పరిస్థితులు మాత్రం దీనికి తగిన విధంగా లేవని తెలుస్తోంది. ఆయన వ్యవహార శైలి, మాటతీరు, దూకుడు ఎప్పుడూ ఆయనను వార్తల్లో వ్యక్తి ని చేశాయి. ఎన్నికలు మరో మూడు రోజుల్లో జరగనున్న వేళ చింతమనేని గెలుపు కోసం ఏటికి ఎదురీదుతున్నారు. ఐదేళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చింతమనేని దూకుడుగా వెళ్లడం, సొంత పార్టీలోనే చాలా మందికి నచ్చలేదు. దీంతో ఇప్పుడు వీరిలో చాలా మంది వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.
వాస్తవానికి ఇప్పటికే వరుస గెలుపులతో ఉన్న చింతమనేనికి వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ ఖాయమని ఆయన అభిమానులు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇదంతా ఎన్నికల నోటిఫికేషన్కు ముందున్న పరిస్థితి మాత్రమే. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటినుంచి ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్ది చింతమనేని గ్రాఫ్ బాగా డౌన్ అయ్యిందన్నది మాత్రం వాస్తవం. చింతమనేని విజయానికి ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఆయన వ్యవహారశైలీయే అడ్డుగా ఉంది. ఆది నుంచి కూడా చింతమనేని వివాదాస్పదంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత ఇసుక వ్యవహారం.. ఆయనకు పంట పండించింది. ఈ క్రమంలోనే తహసీల్దార్ వనజాక్షి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం దీనిని సర్దు బాటు చేసేసింది. కానీ, ఇది సమసి పోయినా.. ఎమ్మెల్యే శైలి మాత్రం మారలేదు.
ఇదిలావుంటే, ఇప్పుడు ఇక్కడ వైసీపీ నాయకుడు కొఠారు అబయ్య చౌదరి మంచి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇక్కడి ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకుపోవడమే కాకుండా ఆయన ఇక్కడ ఎమ్మెల్యే ను ఎందుకు మార్చాలో కూడా వివరిస్తు న్నారు. ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటున్నారు. ముఖ్యంగా ఎమ్మల్యే బాధితులకు కొఠారు అండగా నిలుస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేనికి వ్యతిరేకంగా పోటీ చేయడానికి అభ్యర్థులు ఉంటారా ? అన్న చర్చ నడుస్తోన్న టైంలో ఎంట్రీ ఇచ్చిన అబ్బయ్య చౌదరి దెందులూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకుపోయారు. క్లాస్ ఓటింగ్తో పాటు న్యూట్రల్ జనాలు, ప్రభాకర్ సొంత సామాజికవర్గం వారు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాలు ఆయనకు మద్దతు ఇస్తున్నాయి.
కొంతమంది అబ్బయ్యకు మద్దతు ఇచ్చే విషయంలో బయటపడకపోయినా ఇంటర్నల్గా సపోర్ట్ చేయడమో లేదా ? ఎన్నికల్లో ఓటే వేస్తామని చెప్పడమో చేస్తున్నారు. దీంతో ఇక్కడ చింతమనేనికి చింతలు స్టార్టయ్యాయని అందరూ చెప్పుకొంటుండడం గమనార్హం మరోపక్క, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే రెండు సార్లు చింతమేననిని టార్గెట్ చేశారు. ఇక్కడ బీసీ వర్గానికి చెందిన మహిళకు పవన్ సీటు ఇచ్చారు. ఆ సామాజికవర్గం ఓట్లు ఎప్పుడూ చింతమనేనికి అండగా ఉంటూ వచ్చాయి. ఇప్పుడు అదే వర్గానికి చెందిన మహిళకు పవన్ సీటు ఇవ్వడంతో ఆ ఓట్లు కూడా టీడీపీకి పడే ఛాన్స్ లేదు. ఏదేమైనా దెందులూరులో చింతమనేని చిక్కుల్లో పడ్డారు.