తెనాలి. ఆంధ్రాప్యారిస్ గా పిలుచుకునే ఈ తెనాలిలో రాజకీయ చైతన్యం బాగా ఎక్కువ. అంతే కాదు.. ఈ నియోజకవర్గంలో కుటుంబ రాజకీయం కూడా చాలా ఎక్కువ. తెనాలిలో మొదటి నుంచి మూడు, నాలుగు కుటుంబల ఆధిపత్యంలోనే రాజకీయాలు సాగాయి.
ఆలపాటి వెంకట్రామయ్య ఇక్కడ వరుసగా నాలుగుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. ఆ తర్వత కొన్నాళ్లు దొడ్డపనేని కుటుంబం ప్రాతినిథ్యం వహించింది. తెలుగుదేశం ప్రారంభించిన తర్వాత అన్నాబత్తుని కుటుంబం రెండు సార్లు ఇక్కడ గెలిచింది. అన్నాబత్తుని సత్యనారాయణ రెండు సార్లు గెలిచారు.
ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు ఒకసారి.. ఆయన తనయుడు నాదెండ్ల మనోహర్ రెండు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేలయ్యారు. గత ఎన్నికల్లో మళ్లీ ఆలపాటి కుటుంబం నుంచి ఆలపాటి రాజా ఎమ్మల్యే అయ్యారు. విచిత్రమేమిటంటే.. ఇప్పుడు కూడా బరిలో ఈ మూడు కుటుంబాలే మిగలడం విశేషం.
టీడీపీ నుంచి ఆలపాటి రాజా బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి అన్నాబత్తుని శివకుమార్, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. వైసీపీని ఆదరించే ఎస్సీవర్గం ఓటర్లు ఇక్కడ ఎక్కువగా ఉండటం ఆ పార్టీకి కలిసిరానుంది. ఇక నాదెండ్ల మనోహర్ తన పాలనాకాలంలోని అభివృద్ధి వివరించి ఓట్లడుగుతున్నారు. నాదెండ్ల మనోహర్ కు సామాజిక వర్గం అండ ఉంది.
అయితే ఇక్కడ జనసేన ఎవరి ఓట్లు లాక్కుంటుందనేదే విజయాన్ని ప్రబావితం చేయనుంది. జనసేన టీడీపీ ఓట్లకే గండికొడుతుందని.. ఈసారి వైకాపా విజయం తథ్యమని అన్నాబత్తుని గట్టి నమ్మకం తో ఉన్నారు. ఆలపాటి రాజా ఆశించినంతగా పనిచేయలేదన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతానికి అన్నాబత్తుని వైపే మొగ్గు కనిపిస్తోంది.