2014 ఎన్నికల్లో సులువుగా గెలిచేసి కేబినెట్‌లో ఛాన్స్ కొట్టేసిన కొందరు మంత్రులు ...ఇప్పుడు గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రత్యర్ధులు బలం పుంజుకోవడంతో గట్టి పోటీ ఎదురుకుంటున్నారు. ఇలా తీవ్ర పోటీ ఎదుర్కుంటున్న మంత్రుల్లో కింజరాపు అచ్చెన్నాయుడు ఒకరు. గత ఎన్నికల్లో టెక్కలి నుంచి విజయం సాధించి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాపై ఇప్పుడు.. అక్కడి ప్రజల్లో కొంత వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఈ వ్యతిరేకత రావడానికి ఆయన వ్యవహారశైలే ప్రధాన కారణమని తెలుస్తోంది. పైగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న పేరడా తిలక్ కూడా ఇక్కడ బలంగా ఉండటంతో అచ్చెన్న‌ గెలుపు కోసం కష్టపడుతున్నారు. పైగా ఈ సారి టెక్క‌లిలో 45 వేల పైచిలుకు ఉన్న కాళింగ సామాజిక‌వ‌ర్గం పార్టీల‌కు అతీతంగా త‌మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన తిల‌క్‌ను గెలిపించుకోవాల‌న్న క‌సితో ఉంది. ఇక అచ్చెన్న వ‌ర్గ‌మైన కొప్పుల వెలమ ఓట్లు కేవ‌లం 7 వేలు మాత్ర‌మే. ఈ లెక్క‌న చూస్తే ఈ సారి అచ్చెన్న గెలుపు సులువు కాదు.


ఇక బొబ్బిలి నుంచి పోటీ చేస్తున్న సుజయకృష్ణ రంగారావు...గెలవడం కూడా అంత సులువు కాదని తెలుస్తోంది. ఈయనకి పోటీగా రైతు కుటుంబం నుంచి వచ్చిన శంబంగి చినఅప్పలనాయుడు వైసీపీ తరుపున బరిలో ఉన్నారు. శంబంగి రాజ‌కీయంగా చాలా సీనియ‌ర్. ఆయ‌న గ‌తంలో టీడీపీ నుంచి ప‌లుసార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. బొబ్బిలి రాజుల‌కు చెక్ పెట్టాల‌ని చూస్తోన్న సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ ఈయ‌న‌కు పూర్తిగా స‌పోర్ట్ చేస్తున్నారు. అటు విశాఖపట్నంలో ఇద్దరు మంత్రులు ఎదురీతున్నట్లు తెలుస్తోంది. విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు, నర్సిపట్నం నుంచి పోటీ చేస్తున్న చింతకాయల అయ్యన్నపాత్రుడులు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్ర‌తిసారి నియోజ‌క‌వ‌ర్గం మారి గెలిచే గంటా ఈ సారి కూడా నార్త్‌కు వెళ్లారు. అయితే ఇక్క‌డ బీజేపీ, వైసీపీ నుంచి ఆయ‌న‌కు గ‌ట్టి పోటీ ఎదుర‌వుతోంది. 


ఇక 2009లో ఓడి గ‌త ఎన్నిక‌ల్లో చావుత‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా కేవ‌లం 2 వేల‌తో గెలిచిన అయ్య‌న్న‌పాత్రుడు ఈ సారి గెల‌వ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది. ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని చెప్పిన అయ్య‌న్న బాబు ఒత్తిడితో బ‌రిలో ఉన్నా వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. ఈ క్ర‌మంలోనే విప‌క్ష పార్టీల‌కు చెందిన వారిని త‌న పార్టీల‌తో చేర్చుకుంటున్నారు. 


అటు 2014లో తూర్పు గోదావరి పెద్దాపురం నుంచి పోటీ చేసి గెలిచి హోం మంత్రి, డిప్యూటీ సీఎం అయిన చినరాజప్పకి ఈసారి గెలవడం కష్టమే అని తెలుస్తోంది. ఈయనకి తోట నరసింహం భార్య వాణి గట్టి పోటీ ఇస్తుంది. జనసేన వలన కూడా రాజప్పకి నష్టం జరగొచ్చని సమాచారం. ఇక కృష్ణా జిల్లా మైలవరం బరిలో ఉన్న మరో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు గెలుపు కోసం పోరాడుతున్నారు. గత ఎన్నికల్లోనే తక్కువ మెజారిటీతో బయటపడిన దేవినేనికి వైసీపీ అభ్యర్ది వసంత కృష్ణప్రసాద్ చుక్కలు చూపిస్తున్నారు. అదేవిధంగా మచిలీపట్నం నుంచి పోటీ చేస్తున్న కొల్లు రవీంద్ర...వైసీపీ, జనసేన అభ్యర్ధుల నుంచి గట్టి పోటీ ఎదురుకుతున్నారు.


ఇక గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న సీఎం తనయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్ కూడా ఎదురీతున్నారు. లోకేశ్ పట్ల స్థానికుల్లో వస్తున్న వ్యతిరేకతతో పాటు...వైసీపీ అభ్యర్ది ఆళ్ళ రామకృష్ణారెడ్డి బలంగా ఉండటం వలన గెలుపు స‌లువు కాదు. ఇదే గుంటూరులో వేమూరు నుంచి పోటీ చేస్తున్న నక్కా ఆనందబాబు ఈ సారి గెలవడం కష్టమని తెలుస్తోంది. అటు నెల్లూరు సిటీ బరిలో ఉన్న మంత్రి నారాయణ, సర్వేపల్లి బరిలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు విజయం సాధించటం అంత సులువు కాదని తెలుస్తోంది. చూడాలి మరి ప్రత్యర్ధుల పోటీ తట్టుకుని ఈ మంత్రుల్లో ఎవరు విజయం దక్కించుకుంటారో... ? ఇక మంత్రుల‌కే ఈ ప‌రిస్థితి ఉంటే చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో సీనియ‌ర్లు సైతం వైసీపీ అభ్య‌ర్థుల నుంచి తీవ్ర‌మైన పోటీ ఎదుర్కొంటున్నారు. వీరిలో చాలా మంది ఇప్ప‌టికే పోలింగ్ కూడా జ‌ర‌క్కుండానే చేతులు ఎత్తేసిన ప‌రిస్థితి.


మరింత సమాచారం తెలుసుకోండి: