రాజకీయాలు మారుస్తా.. ప్రశ్నిస్తా.. అంటూ వచ్చిన జనసేన అధికార పార్టీతో కుమ్మక్కయ్యిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఓ అవగాహనతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని విమర్శించారు. ఇందుకు ఉదాహరణగా ఆయన ఓ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.
పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరంలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్లా చంద్రబాబు కానీ.. ఆయన కొడుకు లోకేశ్ కానీ.. ప్రచారానికి వెళ్లని విషయాన్ని జగన్ గుర్తు చేశారు. అలాగే చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం, లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో పవన్ కల్యాణ్ ప్రచారానికి రాని విషయాన్ని జగన్ ప్రస్తావించారు.
ఈ ఇద్దరివీ ఒకే పార్టీలా ? లేక వేర్వేరు పార్టీలా? ఆలోచన చేయమని కోరుతున్నానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జగన్. ఆయన ఇంకా ఏమన్నారంటే...
" దుర్యోధనుడు ఏం చేసినా.. కౌరవ సభలో కొందరికి గొప్పగా కనిపంచేదట.. అధికార మదంతో దుర్యోధనుడిని పొగిడినవారిని దుష్ట శక్తులంటాం. హిట్లర్ చేసిన దుర్మార్గులను కప్పిపెట్టి.. రెండో ప్రపంచ యుద్దంలో ఓడిపోతున్నా కూడా గెలుస్తున్నాడని ఆ నాడు జర్మనిలో రేడియోలోతప్పుడు ప్రచారం చేసినవాడు.. హిట్లర్ మంత్రి గోబెల్స్.
వీటిన్నిటిని వింటా ఉంటే.. ఎవరైనా గుర్తుకు వస్తుందా? ఇదే మాదిరిగా ఉండే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, టీవీ5 గుర్తుకు వస్తున్నాయా? ఎన్ని కుట్రలు చేసినా.. చంద్రబాబు నాయుడు ఓటమి కాయమని ప్రజలు నిర్ణయానికి వచ్చినా.. కూడా గోబెల్స్ తరహాలో చేస్తున్నా ప్రచారాన్ని చూడమని కోరుతున్నా.. 10 ఎల్లో మీడియా చానెళ్లు మైక్స్ పట్టుకోని ప్రచారం చేసినంతా మాత్రానా చంద్రబాబు చేసిన మోసాలు మంచివి అయిపోతాయా? " అంటూ జగన్ నిలదీశారు.