ఏపీలో సాధారణ ఎన్నికల వేళ విపక్ష వైసీపీ అభ్యర్థులే టార్గెట్గా అధికార టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో వైసీపీకి చెందిన ఒక కార్యకర్త మృతి చెందారు. అలాగే ఏకంగా ఇద్దరు వైసీపీ అభ్యర్థులపై సైతం దాడులకు తెగబడడంతో వారికి గాయాలు అయ్యాయి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజవర్గం పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుంలో టీడీపీ నేతల రాళ్ల దాడిలో వైసీపీ కార్యకర్త వెంకటరమణారెడ్డి మృతిచెందారు. ఓటర్లను టీడీపీ నాయకులు ప్రలోభపెడుతుండడంతో రమణారెడ్డి అడ్డుకోగా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ బాబుతో పాటు ఆయన కుమారుడిపై టీడీపీ శ్రేణులు భౌతిక దాడి చేశాయి. ఐరాల మండలంలోని పొలకల కట్టకిందపల్లిలో రిగ్గింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందటంతో ఆయన అక్కడకు వెళ్లారు. దీంతో టీడీపీ శ్రేణులు...ఎంఎస్ బాబును పోలింగ్ బూత్లోకి వెళ్లనీయకుండా అడ్డుకుని.... దాడి చేయడమే కాకుండా ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడిని కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియాపైనా టీడీపీ శ్రేణులు దాడులకు దిగినట్టు తెలుస్తోంది. దాడిలో గాయపడ్డ బాబును వేరే వాహనంలో చికిత్స నిమిత్తం చిత్తూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాబు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడులను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు చిత్తూరు వైసీపీ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగాయి.
ఇక విజయనగరం జిల్లా కురుపాం వైసీపీ అభ్యర్థి పుష్పశ్రీవాణిపై సైతం టీడీపీ నాయకులు దాడి చేసినట్టు తెలిసింది. కురుపాం నియోజకవర్గంలోని జీఎంవలస మండలం చినకుదమలో అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజును టీడీపీ కార్యకర్తలు నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న పుష్పశ్రీవాణి చినకుదమకు చేరుకోగా టీడీపీ నాయకులు ఆమెను మహిళ అని చూడకుండా దాడి చేయడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అక్కడ పోలీసు బలగాలు సరిపడినంత లేకపోవడంతో స్థానికంగా ఉన్న మహిళలే పుష్పశ్రీవాణికి రక్షణగా నిలిచారు.
ఇక గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, మాచర్ల, మంగళగిరి, సత్తెనపల్లి, నరసారావుపేట నియోజకవర్గాల్లోనూ టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలను అడ్డుకోవడంతో పాటు దాడులకు దిగినట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల టీడీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులను బలవంతంగా అడ్డుకుని మరీ రిగ్గింగ్ చేసుకున్నారు. ఏదేమైనా ఎన్నికల వేళ టీడీపీ శ్రేణులు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.