ఏపీలో సాధారణ ఎన్నికల్లో ఫ్యాన్ జెట్ రాకెట్ స్పీడ్తో దూసుకుపోయింది. ఈ రోజు ఉదయం నుంచి జరిగిన పోలింగ్ సరళిని బట్టి పలు జిల్లాల్లో ఫ్యాన్ జోరుకు సైకిల్ బేజారు అయ్యింది. వైసీపీ అధినేత వైఎస్.జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీ క్లీన్స్వీప్ చేసినట్టు ఆ జిల్లాలో ట్రెండ్స్ చెపుతున్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్న టీడీపీ ఈ సారికి మాత్రం ఖాతా తెరిచే పరిస్థితి లేదన్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న జమ్మలమడుగు, రైల్వేకోడూరులో టీడీపీ చేతులు ఎత్తేసింది. అసెంబ్లీ సెగ్మెంట్లలో వచ్చే భారీ మెజార్టీతో కడప, రాజంపేట రెండు ఎంపీ సీట్లు కూడా భారీ మెజార్టీతో వైసీపీ ఖాతాలో పడుతున్నాయ్.
ఇక ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లోనే వైసీపీ వేవ్ తిరుగులేకుండా ఉంది. ఐదేళ్ల టీడీపీ పాలనలో జిల్లాకు ఏ మాత్రం ఒరిగింది లేదన్న విమర్శలు ఉన్నాయి. మొత్తం 12 సీట్లలో నాలుగు మినహా మిగిలిన అన్ని స్థానాల్లోనూ వైసీపీ జెండా ఎగురుతున్నట్టు ప్రైమరీ రిపోర్ట్. బాపట్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ కాస్త ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. ఇక నెల్లూరు జిల్లాలో వైసీపీ జోరు ముందు సైకిల్ కుదేలైపోయింది. మహాఅయితే టీడీపీ 1-2 సీట్లకు పరిమితం అవ్వడం మినహా చేసేదేం లేదంటున్నారు.
ఇక సీమలోని కడప మినహా మిగిలిన మూడు జిల్లాల్లోనూ వైసీపీ టీడీపీపై స్పష్టమైన ఆధిక్యం సాధించినట్టు తెలుస్తోంది. కర్నూలులో టీడీపీ ఈ సారి పుంజుకుందని ఆ పార్టీ వాళ్లు చెప్పినా పోలింగ్లో మాత్రం ఓటరు మాత్రం ఈ సారి జగన్ ఎలాగైనా సీఎం కావాలన్న కసితో ఫ్యాన్ గుర్తుకే ఓట్లేసినట్టు తెలుస్తోంది. టీడీపీ కంచుకోట అనంతపురం జిల్లాలో ఈ సారి ఆ పార్టీ కోటలన్నీ బద్దలయ్యాయి. చివరకు ఓ ఫ్యామిలీ వారసుడు పోటీ చేసిన చోట కూడా గెలుపు వస్తుందా ? రాదా ? అన్న సందిగ్ధంలో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి.