ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో కీలకమైన పోలింగ్్ ఘట్టం ముగిసింది. ముఖ్యమైన కౌంటింగ్ ఉత్కంఠ మరోవైపు మొదలవుతోంది. అయితే, ఈ సమయంలో, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంలను తప్పుపడుతున్నారు. అయితే, బాబు కామెంట్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుపట్టారు. 
చంద్రబాబు మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయని అంబటి అన్నారు. ``మీరు ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారంటే 23 తర్వాత అని చంద్రబాబు చెప్పారు. మంచి రోజు చూసుకోమనండి ప్రమాణస్వీకారం చేస్తారో మరేం చేస్తారో ప్రజలు చూస్తారు.

అధికారులను చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సాక్షాత్తు ఈసి అధికారినే చంద్రబాబు బెదిరించారు.ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను కొనేశారని చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు అధికారులను ధూషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అధికారులలో కొందరిని మీరు మారిస్తే ఎందుకు మీరు కంగారు పడుతున్నారు. ఈవీఎంలు పనిచేయకపోతే పోలింగ్ శాతం ఎలా పెరిగింది? పోలింగ్ పెరుగుదల ప్రభుత్వ వ్యతిరేకతను స్పష్టం చేస్తోంది. ఓటమి భయంతో చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని చూస్తున్నారు`` అని అంబటి మండిపడ్డారు. 


గత కొన్నిరోజులుగా చంద్రబాబు మాటలు పరిశీలిస్తే ఆయన అధికారం కోల్పోబోతున్నారని అర్దం అవుతోందని అంబటి తెలిపారు. ``చంద్రబాబును ప్రజలు తిరస్కరిస్తున్నారని అర్దమవువుతుంది. చంద్రబాబు ఓటమి భయం పట్టుకుంది. నిజంగా చంద్రబాబు గెలుస్తారనే భావిస్తే అంత కంగారు ఎందుకు పడుతున్నారు. ఈసీని, అధికారులను,ఈవిఎంలను చంద్రబాబు తప్పుపడుతున్నారు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. కోడెల శివప్రసాద్ పై మా పార్టీ కార్యకర్తలు దాడి చేయలేదు. కోడెల ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్ స్టేషన్ లోకి వెళ్లి తలుపులు ఎందుకు వేసుకున్నారు. కోడెల అక్కడ కుట్రపూరితంగా వ్యవహరించారు కాబట్టి ఆ గ్రామ ప్రజలు తిరగబడ్డారు. బూత్ ఆక్రమణ,రిగ్గింగ్ వంటి అంశాలకు మేం దూరం. కోడెల పై ఉన్న కేసులు చూస్తే ఎవరు ఇలాంటి అంశాలకు గతంలో పాల్పడ్డారో తెలుస్తుంది. ఈవీఎంలు మొరాయించాయని చంద్రబాబు మాట్లాడటం ఏంటో అర్దం కావడం లేదు.

చంద్రబాబు మాటలు ప్రెస్ మీట్ లో విలేకరులకే అర్దం కావడంలేదు. దుర్మార్గపాలన చేసిన చంద్రబాబును ఓడించడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. దుష్టపరిపాలన అంతం చేయాలని ప్రజలు భావించారు.అందుకే రాత్రి 9 గంటలుదాటినా క్యూలలో నిలుచుని ఓట్లు వేశారు. టీడీపీ నేతలు దాడులు చేసి ఆ దాడులు మాపై నెడుతున్నారు.అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు. 2014 ఎన్నికలలో ఇదే ఈవిఎంల వల్ల గెలిచిన విషయం వాస్తవం కాదా? ఈ ఎన్నికలలో మాత్రం అవే ఈవిఎంలు పనికిరాలేదా.``అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. ``మే 23 వతేదీన అందరి జాతకాలు బయటపడతాయి. వచ్చే మే 23 వతేదీన చంద్రబాబు నిజమైన శక్తి బట్టబయలు కాబోతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది.`` అని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: