తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ లన మంత్రాంగంతో వార్ను వన్ సైడ్ చేసేసారు. శాసనసభ ఎన్నికలు జరిగిన నాలుగు నెలలకే లోక్సభ ఎన్నికలు వచ్చేసాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 సీట్లలో హైదరాబాద్లో ఎం.ఐ.ఎం మినహాయిస్తే మిగిలిన 16 సీట్లు గెలుచుకుని తెలంగాణ దెబ్బ ఏంటో ఢీల్లీకి చూపించాలని కేసీఆర్ తన నినాదంగా మార్చుకుని ప్రచారం చేశారు. తాజా లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్కు కొన్ని షాకులు తప్పేలా లేవు. శాసనసభ ఎన్నికల్లో వచ్చిన గెలుపుతో తెలంగాణలో విపక్ష పార్టీల గొంతును నొక్కే ప్రక్రియ అప్పుడు ప్రారంభించేశారు. ఇప్పటికే ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలను గులాబి గూటికి చేర్చుకున్నారు. తెలంగాణలో ప్రతిపక్షంతో పాటు ప్రజాగుర్తును సైతం నొక్కే ప్రక్రియ ప్రారంభం కావడంతో నియంతృత్వాన్ని అంగీకరించని తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తాజా ఎన్నికల్లో వ్యతిరేఖతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
మల్కాజ్గిరి, భువనగిరి, నల్గొండ, ఖమ్మం, సికింద్రాబాద్, చేవెళ్ల, కరీంనగర్ లాంటి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు గట్టి పోటీ ఎదురైంది. ఈ పోటీయే టీఆర్ఎస్పై రైతుల్లో, ప్రజల్లో ఉన్న వ్యతిరేఖతకు దర్పణంగా నిలుస్తోంది. చివరకు కేసీఆర్ కుమార్తె పోటీ చేస్తున్న నిజామాబాద్లోనూ ఏకంగా 180 మంది రైతులు నామినేషన్లు వేసి ఎన్నికల బరిలో నిలిచి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. పూర్తి ఏకపక్షంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కు ఉంటాయనుకున్న టైమ్లో నల్గొండలో టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగంలోకి దిగి ఆ రెండు స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చారు. ఖమ్మంలో రేణుకా చౌదరి, మల్కాజ్గిరిలో రేవంత్రెడ్డి సైతం టీఆర్ఎస్ అభ్యర్థులకు ధీటుగా నిలబడ్డారు. చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. టీఆర్ఎస్కు కాంగ్రెస్ నుంచి ఈ ఐదు స్థానాల్లో గట్టి పోటీ ఎదురు అవ్వడం ఒక ఎత్తు అయితే అనూహ్యంగా రెండు లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి సైతం టీఆర్ఎస్కు గట్టి పోటీ ఎదురైంది.
సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి, కరీంనగర్లో బండి సంజయ్ నుంచి సైతం అక్కడ ఆధికార పార్టీ అభ్యర్థులకు ప్రతి ఘటన ఎదురైంది. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి పార్టీ సీనియర్ నేతకాగా.. అనూహ్యంగా కరీంనగర్లో గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చిన సంజయ్ ఎంపీగానూ టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్కుమార్కు ధీటైన పోటీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. టీఆర్ఎస్కు కంచుకోటలాంటి కరీంనగర్ జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేఖత ప్రారంభం అయ్యింది అనడానికి ఇదే నిదర్శనం అని అంటున్నారు. ఏదేమైనా టీఆర్ఎస్ 16 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్గా పెట్టుకుంటే ఆ పార్టీకి ఏడూ స్థానాల్లో గట్టి పోటీ ఎదురవుతోంది. మరి వీరిలో ఎవరు టీఆర్ఎస్ అభ్యర్థులకు షాక్ ఇస్తారో ? చూడాల్సి ఉంది. జాతీయ మీడియా వర్గాలు సైతం ఈ సారి తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లోక్సభ ఎన్నికల సాక్షిగా కొన్ని షాకులు తప్పవని చెబుతున్నాయి.