ఎన్నికలు ముగిశాయి. పోటా పోటీగా సాగిన ఎన్నికల్లో అతిరథమహారథులు అనబడే వ్యక్తులు కూడా పోటీ చేశారు. ఈ క్రమంలోనే కొందరు సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో సెలబ్రిటీల కుటుంబ సభ్యులు కూడా రంగంలోకి దిగి తమ భవిష్యత్తును పరీక్షించుకున్నారు. ఇలాంటి వారిలో విశాకపట్నం ఎంపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ అల్లుడు, గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి మనవడు ఎం. శ్రీభరత్ విశాఖ ఎంపీ స్థానం నుంచి టీడీపీ టికెట్పై పోటీ చేశారు. అయితే, ఇదే నియోజకవర్గం నుంచి కీలకమైన పార్టీల తరఫున హేమాహేమీలే రంగంలోకి దిగారు. జనసేన తరఫున సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ, బీజేపీ తరఫున పురందేశ్వరి వంటి వారు రంగంలో ఉన్నారు. పైగా శ్రీభరత్ రాజకీయాలకు కొత్త కావడం ఇక్కడ గమనార్హం.
దీంతో శ్రీభరత్ గెలుపుపై ఆది నుంచి కూడా అనేక అనుమానాలు నెలకొన్నాయి. జనసేనతో టీడీపీ లోపాయికారీ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ నుంచిఎలాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తిగా ఉన్న శ్రీభరత్ను చంద్రబాబు కేటాయించార ని ప్రచారం జరిగింది. ఇక, తన ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు విశాఖను ప్రత్యేకంగా ఎంచుకోలేదు. హిందూపురం నుంచి పోటీ చేస్తున్న బాలయ్య ఒకరోజు తన షెడ్యూల్ను విశాఖకు కేటాయించుకున్నా.. కూడా ఆశించిన మేరకు ఇక్కడ శ్రీభరత్ పుంజుకోలేక పోయాడనే ప్రచారం జరుగుతోంది. ఇక, గురువారం నాటి పోలింగ్ సరళిని గమనిస్తే.. ఇక్కడ భారీ ఎత్తున ఓటర్లు తరలి వచ్చారు. అయితే, ఇదంతా కూడా జనసేనకు అనుకూలించే అవకాశం ఉందని అంటున్నారు.
జనసేన తరఫున పోటీ చేస్తున్న లక్ష్మీనారాయణకు మేధావుల్లో మంచి మార్కులు ఉండడం, ఏరికోరి ఆయన విశాఖ నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకోవడం, ఇక్కడైతే పలు రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన ప్రజలు ఉండడం వంటివి ఆయనకు కలిసి వస్తున్నాయని ఎన్నికలకు ముందు నుంచి కూడా ఇక్కడ ప్రచారం జరిగింది. ఇక, పోటెత్తిన ఓటర్లను చూసిన తర్వాత కూడా అంచనాలు నిజమయ్యాయి. క్రాస్ ఓటింగ్ బాగా పడిందని చెబుతున్న నేపథ్యంలో ఇదంతా టీడీపీ వ్యతిరేక ఓటింగేనని, ఇది జనసేనకు లాభిస్తుందని అంటున్నారు. అటు నార్త్ ఇండియన్లు, సెటిలర్లలో కూడా చాలా మంది బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
ఇక విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తరంలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందుతారన్న టాక్ ఎక్కువగానే ఉంది. అయితే ఈ నియోజకవర్గాల్లో అసెంబ్లీకి టీడీపీకి ఓటు వేసిన వారు ఎంపీకి వచ్చేసరికి జేడీ వైపు మొగ్గు చూపిన వారే ఎక్కువుగా ఉన్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో కాస్తో కూస్తో ఉన్న కమ్మ వర్గం ఓటర్లు కూడా ముగ్గురు (వైసీపీ, బీజేపీ, టీడీపీ) అదే సామాజికవర్గ అభ్యర్థుల మధ్య చీలిపోవడం కూడా భరత్కు మైనస్ కానుంది. మొత్తంగా చూసుంటే.. టీడీపీ అభ్యర్థికి పోస్ట్ ఎన్నికల అనంతరం ఇక్కడ పరిస్థితి సానుకూలంగా లేదనేవ్యాఖ్యలు జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.