ఏపీలో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత సరళిని విశ్లేషిస్తే జనసేన ప్రభావం చాలా నామా మాత్రంగా ఉంది. ఎన్నికలకు ఆరేడు నెలల ముందు పవన్ ఎంతో ప్రభంజనం సృష్టిస్తాడని చాలా మంది భావించారు. పవన్ దెబ్బ రెండు పార్టీల్లో ఎవరిపై ఉంటుందా ? అని పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. చివరకు పోలింగ్ జరిగాక చూస్తే జనసేన తుస్సుమంది. ప్రత్యేకించి కొన్ని నియోజకవర్గాలు, పవన్ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న మూడు జిల్లాలు మినహా ఏపీలో దాదాపు 8,9 జిల్లాల్లో జనసేన ప్రభావం ఏ మాత్రం లేదు. చివరకు జనసేన కమ్యూనిష్టులు, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నా ఆ కూటమికి సరైన అభ్యర్థులు లేకుండా పోయారు. ఇక వైసీపీకి సంస్థాగతంగా మంచి బలమున్న రాయలసీమలో జనసేన ప్రభావం ఎంతన్నది పరిశీలిస్తే చాలా చాలా నామా మాత్రమని స్పష్టం అవుతోంది.
సీమలోని నాలుగు నియోజకవర్గాల్లో మూడు వంతులకు పైగా నియోజకవర్గాల్లో జనసేనకు అభ్యర్థులే దొరకని పరిస్థితి. హిందూపురం ఎంపీ సీటుకు జనసేన నుంచిగాని.. ఆ పార్టీలోని కూటమి నుంచిగానిఎవ్వరూ పోటీ చెయ్యలేదంటే సీమలో జనసేన కథ ఏంటో తెలుస్తోంది. కనీసం ఓ ఎంపీ సీటుకు కూడా అభ్యర్థిని నిలుపుకోలేని స్థితిలో పవన్ పార్టీ ఉంది. సీమలో జనసేన గెలుపు సంగతి ఎలా ? ఉన్నా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కొద్దో గొప్పో ఓట్లను రాబట్టుకోగలిందన్నది నిజం. స్వతహాగా సినిమా హీరో అయిన పవన్ కళ్యాణ్కు యూత్ క్రేజ్ ఉంది. పవన్ వీరాభిమానులతో పాటు, బలిజ సామాజికవర్గం, మిగిలిన కులాల్లో కొంత మంది యువత గ్లాస్ గుర్తుకు అభిమానం కొద్ది ఓట్లు వేశారు. జనసేనకు పట్టున్న నియోజకవర్గాల్లో ఓ 10,000 వరకు ఓట్లు వస్తేనే సీమలో గొప్పనే అనుకోవాలి. చాలా నియోజకవర్గాల్లో జనసేన 5,000 లోపు ఓట్లకే పరిమితం కానుంది. ఇక కర్నూలు జిల్లాలో ఎస్పీ.వై. రెడ్డి ఫ్యామిలీ పోటీ చేసిన నాలుగు సీట్లు, అనంతపురం అర్బన్, ధర్మవరం, చిత్తూరు, తిరుపతి, మదనపల్లి లాంటి నియోజకవర్గాల్లో జనసేన కొద్దిగా ఓట్లు సాధించింది.
ఇక జనసేన సాధించిన ఓట్లు వల్ల టీడీపీ, వైసీపీలలో ఎవరికి ఎంత ? నష్టం, ఎంత ? లాభం అన్నది పరిశీలిస్తే మెజారిటీ విశ్లేషకులు టీడీపీకే ఎక్కువ నష్టమని చెబుతున్నారు. సీమలో ఇప్పుడున్న టఫ్ ఫైట్ నేపథ్యంలో టీడీపీ కొన్ని చోట్ల మహా అయితే 5 నుంచి 10 వేలలోపు ఓట్ల మెజారిటీతో బయట పడే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అయితే ఇప్పుడు అదే నియోజకవర్గాల్లోజనసేన అంతే స్థాయిలో ఓట్లు చీల్చుకోవడంతో టీడీపీ అభ్యర్థులు అంచనాలు తలకిందులై వాళ్ల గెలుపు ముంగిట బొక్కబోర్లపడే చాన్సులు ఎక్కువగా ఉన్నాయి. జనసేన వల్ల చిత్తూరు, అనంతపురం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు టీడీపీ అభ్యర్థులకు గట్టి దెబ్బ పడినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోనూ ఈ ఎఫెక్ట్ కొంత వరకు నంద్యాల లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉండనుంది. ఏదేమైన సీమలో అసలే వీక్లో ఉన్న టీడీపీని పవన్ మరింత దెబ్బ కొట్టాడనే తెలుస్తోంది.