ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. ఆయన మాటల్లోనే చెప్పాలంటే... దేశంలోనే సీనియర్ పొలిటీషియన్. దాదాపు 14 ఏళ్లు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన నేత. ఆయన కుప్పం నుంచి వరుసగా ఏడు సార్లు గెలిచారు. ఇప్పుడు ఎనిమిదోసారి గెలవబోతున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కుప్పం నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోట. 1989న చంద్రబాబు నాయుడు తొలిసారిగా కుప్పం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అప్పటి నుంచి నేటి వరకు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు రెవెన్యూ మంత్రిగా పని చేసి అనంతరం ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు.
మరి ఇలాంటి నేత కూడా ఓ సారి ఘోరంగా ఓడిపోయారు. ఆ వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గతంలో ఓడిపోయింది ఎప్పుడో తెలుసా.. 1983ఎన్నికల్లో... అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
ఇంతకీ ఆయన్ను ఓడించింది ఏ పార్టీ నాయకుడో తెలుసా.. ఏ పార్టీ కాదు.. ఆయనో ఇండిపెండెంట్ అభ్యర్థి. పేరు మేడసాని వెంకట రమణ నాయుడు. ఈ ఎన్నికల్లో వెంకట రమణకు50 వేల పది ఓట్లు వచ్చాయి. చంద్రబాబుకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా.. కేవలం 31 వేల 581. అంటే దాదాపు 20 వేల ఓట్ల తేడాతో చంద్రబాబు ఓ ఇండిపెండెంట్ చేతిలో ఓడిపోయారన్నమాట.