ఏపీలో ప్రతిపక్షాలకు టార్గెట్గా మారిన ఇంటెలిజెన్స్ మాజీ ఐజీ వెంకటేశ్వర్రావును కేంద్ర ఎన్నికల కమిషన్ ఊహించని రీతిలో ఎన్నికలకు ముందే బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ సహా ఇతర పార్టీలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆయన్ను టీడీపీ వెనకేసుకొస్తోంది. తాజాగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన విషయం వెల్లడించారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వర్రావు బాబు తొత్తేనని స్పష్టం చేశారు.
తెలంగాణభవన్లో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సమకాలీన రాజకీయఅంశాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ``తెలంగాణ ఉద్యమ సమయం లో ఆంధ్రజ్యోతి పత్రికలో జాహ్నవి అనే మారుపేరుతో తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాసాలు రాసింది ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వర్రావు కాదా? ఒక ప్రాంతానికి, ఒక కులానికి తొత్తుగా వ్యవహరించే వ్యక్తి అధికారిగా తగునా? దానికి ఫిర్యాదు చేస్తే తప్పు? ఇవి ఎత్తి చూపితే బాధ.`` అంటూ బాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు.
దేశానికి ఐటీని తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడటం బాధాకరమని కేటీఆర్ అన్నారు. ``2014లో ఆయన గెలిచింది ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లోనే కదా? గెలిస్తే ఈవీఎంలు మంచివి.. లేకుంటే కాదా? ఇదేం పద్ధతి. చంద్రబాబు మాట తీరుచూస్తుంటే నాకే కాదు.. సామాన్య టీడీపీ కార్యకర్తకు కూడా ఆయనకు ఓటమి తప్పదని అర్థమవుతున్నది. ఓటమికి కుంటిసాకులు వెతుక్కుంటున్నారని అనుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచింది. నిజంగా ఈవీఎంలను టాంపరింగ్ చేసి ఉంటే ఇది ఎలా సాధ్యమైతది. బీజేపీనే గెలిచేదికదా? చంద్రబాబు చిల్లరమల్లర వాదనలు ఆయన గౌరవానికి, ప్రజాస్వామ్యానికి మంచిదికాదు.`` అని స్పష్టం చేశారు.