తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి రానున్నారు. అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్న తెలుగు మహిళ జస్టిస్ గండికోట శ్రీదేవిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం నిర్ణయించింది. తనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలన్న జస్టిస్ శ్రీదేవి వినతికి సానుకూలంగా స్పందించిన కొలిజీయం..ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి చెందిన జస్టిస్ శ్రీదేవి 1960 అక్టోబరు 10వ తేదీన జన్మించారు. జస్టిస్ శ్రీదేవి 1986లో లా పూర్తి చేశారు. 2005లోఝాన్సీలో జిల్లా సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ 23న అలహాబాద్ హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఘజియాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు.
తెలంగాణ హైకోర్టుకు 24 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ను మినహాయిస్తే 10 మంది మాత్రమే న్యాయమూర్తులు ఉన్నారు. ఇటీవల ఆమె తనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆమె అలహాబాద్ హైకోర్టు సీజే ద్వారా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు కొలీజియం, ఆమెను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించి ఆ మేర కేంద్రానికి సిఫార్సు చేసింది.