రాజకీయాల్లో విశ్వసనీయత, నమ్మకం అనే విషయాలను భూతద్దం పట్టుకుని వెతికినా కనిపించని పరిస్థితి నెలకొంది. రాజకీయాల్లోకి వచ్చేది పదవులు అనుభవించడం కోసమే అనిభావించే నాయకులు ఏరు దాటాక తెప్పను తగలేసిన సంద ర్భాలు ఇటీవల కాలంలో మనకు అనేకం కనిపించాయి. ఇలాంటి వారిలో మంత్రి ఆదినారాయణ ఒకరు., గత ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్పై గెలిచిన ఆది.. తర్వాత కాలంలో మంత్రి పదవిపై ఆశపుట్టి వైసీపీకి జల్లకొట్టి.. చంద్రబాబుకు జై కొట్టారు. ఈ క్రమంలోనే మంత్రి పదవిని సైతం దక్కించుకున్నారు. ఇక, ఇప్పుడు పరిస్థితిని చూస్తే.. ప్రస్తుత సమీకరణల నేపథ్యంలో ఆది నిట్టనిలువునా మునిగే ఛాన్స్ కనిపిస్తోందని అంటున్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో చంద్రబాబు ఆదికి కడప ఎంపీ సీటు కేటాయించడంతోనే ఆయన రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గతంలో ఉన్న ప్రాభవం కూడా నేలమట్టమైందని అంటున్నారు. వైసీపీలో ఉండగా ఏ సమస్య వచ్చినా .. జగన్ ముందుగా ఆదిని రంగంలోకి దింపేవారు. ప్రకాశం జిల్లా పరిషత్ ఎన్నికల సమయంలోను, నెల్లూరు మేయర్ ఎన్నికల సమయంలోను, కడప జిల్లా ఎర్రంగుంట్ల మునిసిపల్ చైర్మన్ ఎన్నికలకుగానీ ఆది సేవలను వినియోగించుకు న్నారు. ఇలా వైసీపీలో కీలక సమస్యలు వచ్చినప్పుడు జగన్కు ఆ బాధ్యతలు అప్పగించడంతో వాటిని సమర్థవంతంగా పరిష్కరించి ఆయన వైసీపీలో ట్రబుల్ షూటర్గా ఎదిగారు. ఈ క్రమంలోనే వైసీపీలోనే కాకుండా రాజకీయంగాకూడా ఆదికి మంచి పేరు వచ్చింది. అయితే, ఇంత విశ్వాసంగా జగన్ చూసుకున్నా కూడా ఆది మాత్రం గెంతులు వేశారు. మంత్రి పదవిపై ఆశతో చంద్రబాబును నమ్మి పార్టీ మారారు. మంత్రి పదవి కోసం కండువా మార్చేసిన ఆది పార్టీ మారాక లైఫ్ ఇచ్చిన జగన్, వైఎస్ ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు చేశారు.
కానీ, ఇప్పుడు అనూహ్యమైన రీతిలో ఆదికి టీడీపీ అధినేత చంద్రబాబు షాకిచ్చారు. జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తాన ని చెప్పినప్పటికీ.. ఆదిని పక్కనపెట్టి.. టీడీపీ నాయకుడు, గత ఎన్నికల్లో ఓడిపోయిన రామసుబ్బారెడ్డికే మళ్లీ టికెట్ ఇ చ్చారు. ఇక, ఆదికి ఊహించని రీతిలో కడప ఎంపీ టికెట్ను ఇచ్చారు. అయితే, ఇది వైసీపీకి పెట్టని కోట. ఇక్కడ నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా.. ఓడిపోవడం ఖాయం. పైగా పార్టీ మారిన నేపథ్యంలో ఆదికి మరింత వ్యతిరేక పవనాలు వీస్తన్నాయి. ఈ నేపథ్యంలో అవినాష్ చేతిలో దాదాపు లక్షకు పైగా ఓట్లతో ఆది ఓడిపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఏదేమైనా చేసుకున్న వారికి చేసుకున్నంత! అనే సామెత ఆది విషయంలో రుజువు అవుతుందని అంటున్నారు. ఇక రేపు టీడీపీ గెలిచినా ఓడినా జమ్మలమడుగులో మళ్లీ రామసుబ్బారెడ్డి పెత్తనమే కంటిన్యూ అయితే ఆదినారాయణరెడ్డి రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది.