ఏపీ సీఎం చంద్రబాబుకు బాగా కష్టపడి పనిచేస్తాడని పేరు. దీంతో పాటే.. ఆయన ప్రతి విషయానికి క్రెడిట్ తీసుకుంటారన్న చెడ్డపేరు కూడా ఉంది. అన్నీ తానే చేశాననే.. తన వల్లే అంతా జరిగిపోతోందని ఆయన పదే పదే చెప్పడం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
చంద్రబాబు ఇలాంటి మనస్తత్వంపై గతంలో చాలా సెటైర్లు వచ్చాయి. నేనే.. అంతా నేనే.. నావల్లె.. అనే క్యాప్షన్లతో సోషల్ మీడియాలో చాలా పోస్టులు కూడా వచ్చాయి. అయితే చంద్రబాబు ఈ నైజాన్ని ప్రతిపక్షనేత జగన్ ఒక్క ముక్కలో సింపుల్ గాచెప్పేశారు.
తాను గెలిస్తే చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకొంటారని... ఓటమిపాలైతే ఆ నెపాన్ని ఇతరుల పైకి నెట్టే ప్రయత్నం చేస్తాడని జగన్ విశ్లేషించారు. ఇందుకు ఆయన చెప్పిన కొన్ని ఉదాహరణలు భలే నవ్వు తెప్పించాయి. అలాగే ఆలోచింపజేశాయి.
ఇంతకూ జగన్ ఏం చెప్పాడంటారా.." చంద్రబాబు తాను ఎన్నికల్లో గెలిస్తే పీవీ సింధుకు బ్యాడ్మింటన్ను తానే నేర్పించానని చెప్పుకొంటాడు.. బిల్గేట్స్కు కంప్యూటర్ను కూడ తానే నేర్పించానని .... సెల్ఫోన్ను కూడ తానే కనిపెట్టానని బాబు చెప్పుకొంటాడని బాబు తీరుపై సెటైర్లు పేల్చారు.
పీవీ సింధు ఆటలో గెలిస్తే.. తానే నేర్పానని అంటారని.. ఒకవేళ ఓడిపోతే మాత్రం కోచ్ తప్పిదమని అతడిపై నెట్టే ప్రయత్నం చేస్తాడన్నారు. బిల్గేట్స్ కంప్యూటర్ బటన్ సరిగా నొక్కని కారణంగానే కంప్యూటర్ సరిగా పనిచేయలేదని బాబు తప్పించుకొంటాడని జగన్ ఎద్దేవా చేశారు. తాను ఓటమి పాలయ్యే అవకాశం ఉందని తెలిసే... చంద్రబాబు ఈవీఎంలపై నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.