ఏపీ బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పరిపాలన, ప్రస్తుత ఎన్నికలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు గురించి ఆయన ఘాటుగా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు గత ఐదేళ్లు అధికారంలో ఉన్నారని, ఈ ఐదేళ్లలో ఆయన వ్యవహరించిన తీరు బాధాకరంగా ఉందన్నారు. బాబు తిరోగమనం వైపు పయనిస్తున్నారని, ఎలక్షన్పై ఆయన మాటలు ఆయన వైఖరిని తెలియజేస్తున్నాయని తెలిపారు. ఎన్నికలు అనేవి ఎలెక్షన్ కమిషన్ జరిపిస్తుందా లేక తన ప్రభుత్వం జరిపిస్తుందా అనేది కూడా తెలియని గందరగోళంలో చంద్రబాబు ఉన్నారన్నారు. గతంలో తన దగ్గర పని చేసిన వ్యక్తులే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ బాధ్యతలు తీసుకున్నారనే విషయం బాబు ఎందుకు గమనించడం లేదని ప్రశ్నించారు.
ఏపీలో బాబు పాలనంతా అవినీతిమయమేనని సోము వీర్రాజు ఆరోపించారు. వాటిని నిరోధించలేని చంద్రబాబు రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపారన్నారు. ఏపీలో అభివృద్ధి జరిగింది అంటున్న బాబు ఎవరి వల్ల అభివృద్ధి జరిగిందో చెప్తే బాగుంటుందన్నారు. ఏపీ అభివృద్ధి మోడీ వల్ల జరిగింది అది బాబు గారు చెప్పరని వ్యాఖ్యానించారు. మోడీ వల్ల 20 రకాల అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో,పట్టణాల్లో జరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు. `అవినీతిని కింది స్థాయి వరకు సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు. ఇసుకపై 16 వేల కోట్ల రూపాయలు అప్పనంగా మేశారు. అనంతపురం లో కియా సంస్థ కేంద్రం ఇస్తే అది నేనే ఇచ్చానని డబ్బా కొట్టుకుంటున్నాడు. అబద్ధాలు చెప్పడం,రాయడం లో చంద్రబాబు చిత్రగుప్తుడు లాంటి వారు. అభివృద్ధి అనేది ఏపీలో కేంద్రం మూలంగా జరిగింది. ఏపీలో జరిగిన అభివృద్ధి ని ప్రజల వద్దకు వెళ్లకుండా కొత్త వివాదాలు లేవనెత్తారు...ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని నాటకం ఆడుతున్నారు`` అంటూ మండిపడ్డారు.
ప్రత్యేక హోదా అడిగితే జైల్లో పెడతానన్న చంద్రబాబు ఇప్పుడు అదే హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు పోజులు కోడుతున్నారని వ్యాఖ్యానించారు. ``యూ టర్న్ లు ఎక్కువగా తీసుకున్న పేరు బాబుకి దక్కింది...వివాదాలు నిర్మాణం చేయడంలో బాబు దిట్ట.`` అని అన్నారు. ``మంగళగిరి అని పలుకలేకపోతున్నాడు తింగరి మంగళం చినబాబు`` అంటూ లోకేష్పై సోమువీర్రాజు సెటైర్లు వేశారు.