రాబోయే ప్రభుత్వం జనసేనదేనా ? జనసేనకు ఒంటరిగానే 88 సీట్లు సాధిస్తుందా ?  అవుననే అంటున్నారు ఆ పార్టీ తరపున విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్ధిగా  పోటీ చేసిన జేడి లక్ష్మీనారాయణ.  సరే ఎవరు నమ్మినా నమ్మకపోయినా జేడి చెప్పిందైతే అధికారంలోకి రాబోయేది తామేనట. పైగా తాను అఖిల భారత సర్వీసును వదిలిపెట్టి రాజకీయాల్లోకి రావటం చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పారు.

 

సరే అధికారంలోకి వచ్చే విషయంలో జేడి చెప్పింది ఎంత వరకూ సాధ్యమో చూద్దాం. నిజానికి జనసేనకు పార్టీ నిర్మాణమే లేదు. ఓటర్లున్నా వారిని ఓట్లుగా మలచుకునే యంత్రాంగమే లేదన్న విషయం అందిరకీ తెలిసిందే. 88 సీట్లతో జనసేన అధికారంలోకి రావటమే నిజమైతే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా కూర్చున్నారు. పోలింగ్ జరిగిన దగ్గర నుండి ఈరోజు వరకూ పవన్ తరపున కనీసం ఒక్క ప్రకటన కూడా ఎందుకు రాలేదు ?

 

ఇక జనసేన తరపున పోటీ చేసిన వాళ్ళల్లో ఎంతమంది గెలుస్తారో ఎవరూ చెప్పలేకున్నారు. ఎందుకంటే గాజువాక, భీమవరంలో  పోటీ చేసిన పవన్ గెలుపే సందిగ్దంలో పడిందంటున్నారు. కొందరేమో భీమవరంలో పవన్ ఓడిపోతారని చెబుతున్నారు. మరొకొందరేమో రెండు చోట్లా పవన్ కు ఓటమి తథ్యమంటున్నారు. పార్టీ అధినేతే రెండు చోట్లా గెలవలేనపుడు ఇక పార్టీ అభ్యర్ధులు 88 చోట్ల ఎలా గెలవగలరు ?

 

మొదటి నుండి జనేసేన అంతర్గత వర్గాల లెక్కల ప్రకారమే జనేసేన గెలవగలిగేది మహా అయితే ఓ పది స్ధానాలు మాత్రమే.  పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఒకదానిలో పవన్ ఓడిపోతాడని వాళ్ళే చెబుతున్నారు. ఇక జేడి విషయానికి వస్తే టిడిపి పుణ్యమా అని రెండో స్ధానానికి వస్తాడని పార్టీ నేతలే చెబుతున్నారు. మామూలుగా అయితే జేడి రెండోస్ధానానికి కూడా వచ్చే అవకాశం లేదు.

 

టిడిపి తరపున పార్లమెంటుకు పోటీ చేసిన శ్రీభరత్ ఓటమే ధ్యేయంగా పార్టీలో ముఖ్యనేతలు పావులు కదిపారని అంటున్నారు. భరత్ ను ఓడించేందుకే టిడిపి వాళ్ళు జనేసేనకు క్రాస్ ఓటింగ్ చేశారనే ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతోంది. క్రాస్ ఓటింగ్ లో ఓట్లు పడటమే నిజమైతే జేడి రెండోస్ధానంలో నిలుస్తారని అంటున్నారు. వాస్తవం ఇలాగుంటే రాబోయే ప్రభుత్వం జనసేనదే అని, తమ పార్టీ 88 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జేడి చెబితే నమ్మేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: