ఎన్నికలు ముగిసిన ఏపీలో ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మే 23వ తేదీ వరకు ఫలితాల కోసం వెయిట్ చేయడం అన్ని రాజకీయ పక్షాలకూ ఇబ్బందిగానే మారింది. ఇప్పటికే చాలా మంది నాయకులు వివిధ రూపాల్లో ప్రజలు ఎవరి ఓ టు వేశారనే విషయాన్ని అంచనా వేసుకుని, తమ గెలుపు ఓటములపై లెక్కలు కడుతున్నారు. ఇక, కీలకమైన నాయకు లు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఈ ఉత్కంఠ, సర్వేలు మరింత జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంపై అంచనాలు ఊపందుకున్నాయి. ఇక్కడ నుంచి జబర్దస్త్ రోజా రెండో సారి పోటీ చేస్తుండడంతో అంచనాలు పెరిగాయి.
గత ఎన్నికల్లో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై పోటీ చేసిన రోజా స్వల్ప తేడాతో విజయం సాధించారు.ఇక, ఇప్పుడు గాలి వారసుడు భాను ప్రకాశ్పై ఆమె తలపడ్డారు. అయితే, ఇక్కడ చిత్రమైన విషయాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థిగా రోజా పేరు ఎప్పుడో ఖరారు అయినప్పటికీ.. అధికార టీడీపీ నుంచి మాత్రం అభ్యర్థి విషయంలో చివరి నిముషం వరకు కూడా తర్జన భర్జనలు కొనసాగాయి. మాకంటే మాకే టికెట్ ఇవ్వాలని గాలి ఫ్యామిలీ లోనే తంపులు ప్రారంభం కావడం, చంద్రబాబు వీటిని సరిదిద్దేందుకు ఏకంగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఆయన రాయబారంతో చివరి నిముషంలో భాను ప్రకాష్కు టికెట్ ఖరారు చేశారు.
అయితే, అప్పటికే రోజా దూకుడు ప్రదర్శించారు. రూ.4 కే రోజా క్యాంటీన్లు ప్రారంభించారు. నియోజకవర్గంలో మొబైల్ రూపంలో నిర్వహించిన ఈ క్యాంటీన్లకు మంచి ఆదరణ ఏర్పడింది. అదేసమయంలో నియోజకవర్గంలో మహిళలను ఆకట్టుకునేందుకు పుసుపు-కుంకుమ పేరుతో ఇంటింటికీ తిరిగి బొట్టు పెట్టి మరీ అందరినీ తనకు అనుకూలంగా తిప్పుకొన్నారు. అదేస మయంలో వివాదాలకు అక్రమాలకు దూరంగా ఉన్నారు. నియోజకవర్గంలో ఉండరు. హైదరాబాద్కే పరిమితమవుతున్నారనే టీడీపీ నేతలకు చెక్ పెడుతూ.. దాదాపు 10 కోట్ల రూపాయల సొంత వ్యయంతో ఆమె సొంత ఇల్లు నియోజకవర్గంలో కట్టుకోవడం, నియోజకవర్గంలోని పేదలకు అన్నదానాలు చేయడం వంటివి కలిసి వచ్చాయి.
మొత్తానికి చూసుకుంటే.. గాలి సెంటిమెంట్ పనిచేస్తుందని అనుకున్న నియోజకవర్గంలో ఆ కుటుంబంలో ఏర్పడిన వివాదాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో రోజా సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో రోజా గెలుపు ఖాయమని అంటున్నారు. అయితే, ఫలితం వచ్చే ఎదురు చూడాల్సిందే. నిజానికి ఇక్కడ రోజా గెలిస్తే.. సెంటిమెంటు రాకీయాలు పెద్దగా వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదని తెలుస్తుండడం గమనార్హం.