రాష్ట్రంలో సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా.. వేడి మాత్రం చల్లారలేదు. ఎన్నికలకు ముందున్న ఉత్కంఠ కన్నా కూడా ఇప్పుడు రాష్ట్రంలో భారీ ఎత్తున ఉత్కంఠ కొనసాగుతోంది. తెల్లవార్లూ బారులు తీరి మరీ ఓటర్లు తమ హక్కును వి నియోగించుకోవడం, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు కూడా బారులు తీరి ఓటింగ్లో పాల్గొనడం వంటి అంశాల నేపథ్యం లో ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు? ఎవరికి జై కొడుతున్నారు? వంటి విషయాలు కీలకంగా మారాయి. ఒకపక్క, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాం కాబట్టి తామే అధికారంలోకి వస్తామని చంద్రబాబు, లేదు.. ప్రజలు మార్పు కోరుకుంటు న్నారు కాబట్టి.. తమకే అధికార పీఠం దక్కుతుందని వైసీపీలు జోరుగా ప్రచారం చేసుకుంటున్నాయి.
ప్రధానంగా అధికార టీడీపీకి కంచుకోటలుగా ఉన్న కొన్ని జిల్లాలపై ప్రత్యేకంగా చర్చలతోపాటు పందేలు కూడా అదే రేంజ్లో సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క తాడేపల్లి గూడెం టికెట్ మినహా అన్నిచోట్లా టీడీపీ విజయదుందుభి మోగించింది. మొత్తం 15 నియోజకవర్గాల్లో గతంలో సాధించిన ఫలితాలను ఇప్పుడు కూడా దక్కించుకుంటుందని టీడీపీ నాయకులు అంటున్నారు. ఇక, అసలు ఖాతానే తెరవని వైసీపీ ఇప్పుడు ఇక్కడ కొన్ని సీట్లు గెలుచుకుంటుందని నిన్న మొన్నటి వరకు విశ్లేషణలు సాగాయి. అయితే, తాజాగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కొందరు బెట్టింగ్ రాయుళ్లు పశ్చిమ గోదావరి ఎన్నికల రిజల్ట్పై కన్నేశారు. ఇక్కడ ఫలితాల సరళిని వారు గమనించి.. ఇక్కడ టీడీపీ భారీ రేంజ్లో సీట్లు పోగొట్టుకుంటుందని చెబుతున్నారు.
మొత్తం 15 సీట్లలో వైసీపీకి 11 ఖాయమని, మిగిలిన నాలుగు మాత్రమే టీడీపీ తన ఖాతాలో వేసుకుంటుందన్నది వీరి వెల్లడి. ఈ నేపథ్యంలోనే వైసీపీకి అనుకూలంగా బెట్టింగులు లక్షల్లో సాగుతున్నాయి. ఇక, ఇదేసమయంలో టీడీపీ నాయకులు కూడా మొత్తంగా గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు వచ్చే అవకాశం లేదని లోలోనే మథన పడుతున్నారు. కనీసం 6 స్థానాల్లో టీడీపీ ఓడిపోయే పరిస్థితి ఉందన్నది వీరు చెబుతున్న మాట. కానీ, వైసీపీపై మాత్రం పందేలు కడుతున్నవారు ఖచ్చితంగా టీడీపీ భారీ సంఖ్యలో సీట్లు కోల్పోతుందని అంటున్నారు. వైసీపీకి ఖాయంగా 11, టీడీపీకి నాలుగు మాత్రమే వస్తాయని పేర్కొంటూ పందేలకు కాలుదువ్వుతున్నారు. మరి ఇక్కడ పరిస్తితి ఎలా ఉంటుంది? ఎవరికి ఎన్నిసీట్లు వస్తాయనే విషయం తేలేందుకు మే 23వరకు వెయిట్ చేయకతప్పదు.