ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు చెప్తుంది, ఆయన చేస్తుంది ఇదేనంటూ...విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. వరుస ట్వీట్లలో వియసాయిరెడ్డి పంచ్ల వర్షం కురిపించారు. ``ఎన్నికలంటే ఏంటి? ఎవరో డబ్బు ఏర్పాటు చేస్తారు. ఇంకొకరు ఖర్చుచేసి గెలుస్తారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు జరిగేది ఇలాగే గదా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎవరూ మర్చిపోలేదు.ఈ పెద్ద మనిషి ప్రజాస్వామ్యాన్ని ఈసీ పరిహాసం చేసిందని దేశమంతా తిరుగుతూ రంకెలు వేస్తున్నాడు``అంటూ చంద్బరాబు తీరును ఎండగట్టారు.
``జాన్ 8 వరకు నేనే సీఎంని. మధ్యన ఈసీ పెత్తనం ఏంటి? అమెరికాలో ఎన్నికల తర్వాత 8 వారాలు పాత ప్రభుత్వమే కొనసాగుతుంది తెలుసా అంటూ బుకాయిస్తున్నారు. మీరు అమెరికన్ రాజ్యాంగాన్ని అనుసరించి పాలిస్తున్నారా లేక అంబేద్కర్ రాసిన మన దేశ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారా చంద్రబాబూ?`` అంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు దేశ రాజకీయల గురించి విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. ``జాతీయ పార్టీల అధ్యక్షులే కింద మీద పడి పిసుక్కుంటున్నారు.చంద్రబాబు ప్రసంగం విని ఎవరైనా ఓట్లేస్తారంటే నమ్మొచ్చా?అది కూడా కర్నాటక,ఇంకో రాష్ట్రంలో.వేదిక ఎక్కి ప్రసంగించాలి....ముందు మూడు నాలుగు వేల మంది గుంపుగా కనిపిస్తేనే మనవాడికి ఆ రాత్రి నిద్ర పడుతుంది.ఇంకా ఐదు వారాలు ఎలా గడవాలో ఏంటో?`` అంటూ ఓటమి తర్వాత బాబు తీరు ఇలా ఉంటుందంటూ...ఎద్దేవా చేశారు.
ఇక చంద్రబాబు గతంలో చేసిన కామెంట్లను పేర్కొంటూ, ``ప్రజల వ్యక్తిగత వివరాలు దొంగిలించిన ఐటి గ్రిడ్స్పై సైబరాబాద్ పోలీసులు కేసు రిజిస్టర్ చేయగానే చంద్రబాబు ఊగి పోయారు.మీరు ఒక కేసు పెడితే నేను 4కేసులు పెడతానన్నారు. మూలాలు కదులుతాయని వార్నింగులిచ్చారు. సిట్ వేశారు.మంత్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇప్పుడా దర్యాప్తులు ఏమయ్యాయి బాబూ?`` అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
తాజాగా హాట్ టాపిక్గా నిలుస్తున్న బంగారం పట్టివేత గురించి సైతం విజయసాయిరెడ్డి స్పందించారు. ``సరైన అధికారిక పత్రాలు లేకుండా టీటీడీ బంగారాన్ని చెన్నైబ్యాంక్ నుంచి తిరుపతి తరలించడంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో తనిఖీలుంటాయని తెలిసీ 1381 కిలోల బంగారాన్ని అంత నిర్లక్షంగా తీసుకొస్తారా? స్వామి వారి అభరణాలకు సంబంధించిన రికార్డులు మాయమయ్యాయనీ అంటున్నారు.`` అంటూ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ప్రశ్నించారు.