తెలంగాణలో జరుగుతున్న అనేకానేక రాజకీయ పరిణామాల్లో ఇది హాట్ ఎపిసోడ్. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే విపక్ష నేతలంతా చేరిపోతుంటే తాజాగా...ముఖ్యమంత్రి కేసీఆర్కు గుడి కట్టిస్తానని ప్రతిపక్ష ఎమ్మెల్యే ఒకరు ప్రకటించారు. చిత్రంగా ఆయన ఫైర్బ్రాండ్ నేతగా ముద్రపడిన వ్యక్తి కావడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆ ఎమ్మెల్యే ఎవరంటే...సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
గాంధీభవన్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన జగ్గారెడ్డి అవినీతి లేని శాఖ..అవినీతి లేని రాజకీయ నాయకుడు ఉన్నాడా..? అని ప్రశ్నించారు. లంచగొండితనం లేకుండా చేయడం దేవుడి తరం కూడా కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రెవెన్యూ చట్టాన్ని మార్చడం కంటే రెవెన్యూ అధికారుల అభిప్రాయాలు తీసుకుంటే మేలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల్లో మార్పు కనబడుతోందని.. మైనారిటీలు, క్రిస్టియన్లు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కచ్చితంగా 7 లేక 8 ఎంపీ సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన జగ్గారెడ్డి.. క్షేత్రస్థాయిలో తమకు బలం ఉందని గుర్తు చేశారు.
ఈ సందర్భంగానే రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. రైతులకు మద్దతు ధర అందించేందుకు కృషి చేయాలని, ఒకవేళ ఏడాదిలోగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పని చేస్తే తాను ముఖ్యమంత్రి కేసీఆర్కు గుడి కట్టిస్టానని అన్నారు. అంతేకాకుండా తెలంగాణ ఇచ్చినందుకు సోనియాగాంధీకి, రాహుల్గాంధీకి సైతం గుడి కట్టిస్తానని ప్రకటించారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలు సహజంగానే సంచలనంగా మారింది.