బండ్ల గణేష్...సినీ నటుడు, నిర్మాత. తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో అధికార పార్టీపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే...తాను గొంతు కోసుకుంటానని ప్రకటించాడు. అంతేకాకుండా, హుజూర్నగర్ నియోజకవర్గంలో సీఎం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణకు కాబోయే ఉత్తమ్ కుమార్ రెడ్డి అని జోస్యం చెప్పారు. అయితే, బండ్ల గణేష్ జోస్యం ఫెయిలయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు.
దీంతో, కొద్దికాలం తర్వాత రాజకీయాలకు గుడ్బై చెబుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న తను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. "నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీ కి సంబంధించిన వాడిని కాదు.'' అని ట్వీట్ చేశారు. "కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను.'' అంటూ బండ్ల గణేష్ మరో ట్వీట్ చేశారు.
ఇలా ఆసక్తికర ప్రకటనలు చేసిన బండ్ల తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన తిరిగి కెమెరా ముందుకురానున్నారు. సూపర్స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయనున్న సినిమాలో బండ్ల గణేష్ ఒక ఎంటర్టైనింగ్ రోల్ చేస్తారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. ఇంతకీ బండ్ల కామెడీ పంచుతాడా? రీ ఎంట్రీతో వైఫల్యం చెందుతాడా వేచి చూడాల్సిందే.