రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ముగిసినా ఓవర్ ఆల్గా తెలుగు ప్రజల దృష్టి అంతా ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు అన్న అంశం మీదే ఉంది. తెలంగాణలో సాధారణ ఎన్నికలు నాలుగైదు నెలల క్రిందటే ముగిశాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికలపై ఎవరికి పెద్దగా ఆసక్తి లేదు. రెండు, మూడు సీట్లు కాస్త అటూ ఇటూ అయినా టీఆర్ఎస్ అనుకూలంగా అక్కడ వార్ వన్ సైడ్గా ఉంటుందన్నది స్పష్టంగా తేలిపోయింది. ఇప్పుడు అందరి చూపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా ? టీడీపీ గెలుస్తుందా ? మరో సారి చంద్రబాబు సీఎం అవుతారా ? లేదా దశాబ్దం నిరీక్షణ తర్వాత జగన్ సీఎం పీఠం అధిరోహిస్తాడా ? అన్నది జాతీయ రాజకీయ వర్గాల్లో సైతం బిగ్ హాట్ టాపిక్గా మారింది. వైసీపీ, టీడీపీ ఎవరికి వారు విజయంపై ధీమాతో ఉంటే జగసేన అధ్యక్షుడు మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారు. ఆ పార్టీకి గెలుపుపై పెద్దగా నమ్మకం లేనట్టే స్పష్టంగా తెలుస్తోంది.
ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఇప్పటికే అన్ని సర్వేలు ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. పోలింగ్ అంచనాలు తర్వాత జగన్లో ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టే కనపడుతుండగా సీఎం చంద్రబాబు మాత్రం పైకి ధీమాగా ఉన్నట్టు బీరాలు పోతున్నా లోపల మాత్రం ఆయన తీవ్రమైన అందోళనకు గురవుతున్నారు. పోలింగ్ తర్వాత పదే పదే అటు ఎన్నికల కమిషన్, మోడీపై విరుచుకుపడుతున్నారు. ఈవీఎంలో అనేక లోపాలు ఉన్నాయని చెబుతున్న చంద్రబాబు ఓడిపోతే ముందుగానే ఓటమికి సాకులు వెతుకుతున్నారా ? అన్న విమర్శలకు గురవుతున్నారు. ఎన్నికలకు ముందు నుంచి ఎక్కడ ఏ అధికారిని మార్చినా ఎన్నికల సంఘం మీద ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీ అధికారంలోకి వస్తే ఈవీఎంలు మంచివని.. ఆయన ఓడిపోతే ఈవీఎంలు సక్రమంగా లేవని చెబుతున్నట్టు తెలుస్తోంది.
బాబు ఎన్నికలు ముగిసినప్పటి నుంచి పదే పదే ఈవీఎంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించినప్పుడు ఈవీఎంలు కరక్టే అన్నట్లుగా మాట్లాడారు. ఇప్పుడు తాజాగా పదే పదే ఈవీఎంలను, ఈసీని టార్గెట్ చెయ్యడాన్ని బట్టి చూస్తుంటే ఆయన వ్యాఖ్యలు తన ఓటమిని పరోక్షంగా ఒప్పుకున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు సైతం అంచనాకు వచ్చారు. ఎన్నికలు ముగిసిన మరుక్షణం నుంచే చంద్రబాబు ఈవీఎంలు వద్దు... బ్యాలెట్టే ముద్దు అంటూ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీలకు తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని పెద్ద హంగామా చేస్తున్నారు. టెక్నాలజీ పితామహుడిని తానే అని పదే పదే గొప్పలు పోయే చంద్రబాబు ఇప్పుడు ఈవీఎంల విషయంలో ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారో జాతీయ స్థాయిలో సీనియర్ నేతలకు సైతం అంతుపట్టడం లేదు.
ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లే ముద్దు అంటూ అంటూ పలు ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తూ ఢిల్లీలో చంద్రబాబు చేసిన హంగామా చూసిన వారు చంద్రబాబు అసలు ఓ సీనియర్ రాజకీయ నేతేనా ?అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కూడా. వీవీప్యాట్ల విషయంలో సుప్రింకోర్టు తీర్పు ఇచ్చినా కూడా చంద్రబాబు మాత్రం 50% లెక్కించాలని మళ్లీ పోరాటానికి సిద్ధం అవుతున్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు వైఖరిని చూసిన రాజకీయ విశ్లేషకులు సైతం చంద్రబాబు తన ఓటమిని ఇప్పటికే పరోక్షంగా ఒప్పేసుకున్నారా.. జగన్ సీఎం అవుతున్నారని ఆయనకు స్పష్టంగా తెలిసిందా ? అని కూడా చర్చించుకుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే అటు ఐఏఎస్ల మీద సైతం బాబు విమర్శలకు దిగుతూ వితండవాదం చేస్తుండడంతో వారు సైతం బాబు తీరుపై గుస్సాగా ఉన్నారు.
తాజాగా టెలి కాన్ఫరెన్స్లో పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడిన మాటలు సైతం ఏపీలో టీడీపీకి అధికారం చేజారుతుందన్న సంకేతాలు పార్టీ కేడర్కే పంపుతున్నట్టు అవుతోంది. బాబు వ్యాఖ్యలు, బీడియం చూస్తోన్న టీడీపీ శ్రేణులకే వచ్చే ఎన్నికల్లో తాము గెలుస్తామన్న నమ్మకం సన్నగిల్లుతోంది. ఆపధర్మ సీఎంగా ఉన్నవారు కొన్ని అంశాల్లో సమీక్షలు చెయ్యకూడదన్న నిబంధనలు ఉన్నా చంద్రబాబు మాత్రం జూన్ 8 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని.. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని.. అంత వరకు సమీక్షలు చెయ్యకుంటే ఎలా ? అని ఎదురు ప్రశ్నలు వేస్తుండడంతో చాలా మంది ఇదేం విడ్డోరం అని చర్చించుకుంటున్నారు. ఏదేమైన ఎన్నికలు జరిగినప్పటి నుంచి చంద్రబాబు చేష్టలు, వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనలో ఆయన అధికారం కోల్పోతున్నారన్న డిఫెన్స్లోకి వెళ్లిపోయినట్టే తెలుస్తోంది.