ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు మరో 35 రోజుల సమయం ఉండడంతో బెట్టింగ్ రాయుళ్లు ఠారెక్కిస్తున్నారు. గతంలో ఎన్నికల తేదీ, ఫలితాలు వెలువడేందుకు చాలా తక్కువ టైమ్ మాత్రమే ఉండేది. తెలుగు ఎన్నికల చరిత్రలో ఎప్పుడు లేనంతగా ఎన్నికలు జరిగిన తేదీకి, ఫలితాలు వెలువడేందుకు సుధీర్ఘ సమయం ఉండడంతో ఏపీలో నగరాల నుంచి పట్టణాలు, పల్లెలు వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరికి వారు కాయ్ రాజా కాయ్ అంటూ పందాలు కాస్తున్నారు. ఈ బెట్టింగులు కొన్ని చోట్ల స్థానికంగా తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపు ఓటముల విషయంలో, తమ జిల్లాల విషయంలో జరుగుతుంటే కొందరు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, సీఎం అయ్యేది జగనా ? చంద్రబాబా ? అని బెట్టింగులు వేస్తున్నారు. ఇక ఓవర్ ఆల్గా చూస్తే ఏపీలో ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. వైసీపీ సానుభూతి పరులు బెట్టింగుల విషయంలో రెండింతలు ముందే ఉన్నారు. రూపాయికి రెండు రూపాయిలు ఇస్తామని పందాలు కాస్తున్నా టీడీపీ వారు జంకుతున్న పరిస్థితి.
ఇక వైసీపీ అధినేత జగన్పై రెండు రకాలుగా భారీ ఎత్తున బెట్టింగులు నడుస్తున్నాయి. వైఎస్ జగన్ను పిచ్చ పిచ్చగా అభిమానించే ఆయన సొంత సామాజికవర్గంలోని వీరాభిమానులు, వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ సానుభూతి పరులు వేస్తున్న బెట్టింగ్ ప్రకారం కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, గాజువాక, భీమవరంలలో పవన్కు వచ్చిన మెజారిటీ కంటే పులివేందులలో జగన్కు ఎక్కువ మెజారిటీ వస్తుందని సవాళ్లు రువ్వి మరీ బెట్టింగులు వేస్తున్నారు. గుంటూరు నగరంలో కొన్ని క్లబ్బుల దగ్గర ఈ బెట్టింగ్పై రూపాయికి ఐదు రూపాయిలు ఇచ్చేందుకు కూడా వైసీపీ వాళ్లు వెనుకాడడం లేదు. రెండో బెట్టింగ్ విషయానికి వస్తే జగన్ రేపు ఎన్నికల్లో గెలవడంతో పాటు సీఎం అవుతాడని కాసే బెట్టింగ్తో పాటు వైసీపీకి కచ్చితంగా 100కు పైగా సీట్లు వస్తాయన్న బెట్టింగ్ కూడా భారీ ఎత్తున నడుస్తోంది.
గుంటూరు జిల్లాలో రెడ్డి సామాజికవర్గంలో బాగా ధనవంతులు అయిన వారుతో పాటు ప్రకాశం జిల్లాలోనూ అదే సామాజికవర్గానికి చెందిన కొందరు ఈ తరహా బెట్టింగులు ఎక్కువ కాస్తున్నారు. ఇక వైసీపీ ఖచ్చితంగా 100 సీట్లు గెలుస్తుందని నెల్లూరు జిల్లాలో ఇప్పటికే కోట్లాది రూపాయిలు చేతులు మారుతున్నాయి. రాయలసీమలో కడప, కర్నూలులోనూ ఇదే తరహా బెటింగ్ ఎక్కువగా నడుస్తోంది. ఇక ఉభయగోదావరి, ఉత్తరాంధ్రలో విశాఖ జిల్లాలో మాత్రం వైసీపీ గెలుస్తుందని, జగన్ సీఎం అవుతారని బెట్టింగులు వేస్తున్నా 100 సీట్ల మీద మాత్రం కాస్త తక్కువగా బెట్టింగ్ నడుస్తోంది. ఇక ఉభయగోదావరి జిల్లాలో ఇటు టీడీపీ సానుభూతి పరులు అటు జనసేన సానుభూతి పరులు మాత్రం వైసీపీ 80 నుంచి ఆ లోపు సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని కూడా బెట్టింగులు కాస్తున్నారు.
రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల కంటే భిన్నంగా ఉభయగోదావరిలో మాత్రం కాస్త డిఫ్రెంట్గా బెట్టింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో వైసీపీ 80 సీట్లకు మాత్రమే వస్తుందని జనసేన, టీడీపీ వాళ్లు బెట్టింగులకు తిరుగుతుండడం ఆశ్చర్యకరమే. ఇక కృష్ణా, గుంటూరు జల్లాల్లో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన రైతులు, టీడీపీ సానుభూతి పరులు చంద్రబాబు గెలుస్తాడని చెబుతున్నా బెట్టింగులు కాసేందుకు మాత్రం జంకుతున్న పరిస్థితి. ఏదేమైనా ఏపీలో జరుగుతున్న తీరును బట్టి చూస్తే వైసీపీ సానుభూతి పరుల జోరు ముందు టీడీపీ సానుభూతి పరులు బేజారే అవుతున్నారు. మరి తుది ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.