చంద్రబాబు.. గతంలో మంచి ముఖ్యమంత్రిగా పేరుంది. ఆర్థిక నిపుణుడుగానూ చెప్పుకుంటారు. కానీ గత ఐదేళ్ల ఆయన పాలన అరాచకంగా సాగినట్టు వార్తలు వస్తున్నాయి. అడ్డగోలుగా ఆర్థిక జీవోలు ఇవ్వడం.. ఒకదాని నిధులు మరోదానికి మళ్లించడం ఇలా చాలా అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు ఈ అవకతవకలు ఈసీ వద్దకు చేరినట్టు తెలుస్తోంది. ఆర్థిక శాఖ కార్యదర్శి రవి చంద్ర ఆధ్వర్యంలోని ఆర్ధిక శాఖ ఇచ్చిన జీవోలు అన్నీ తప్పుల తడకలుగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ జీవోలన్నీ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు నిధులు పంచి పెట్టే విధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
ఆర్ధిక శాఖ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అవసరమైన వారికి నిధులు పంపకం చేసేందుకు అడ్డగోలుగా జీవోలు ఇచ్చారని ప్రాధమిక విచారణలో తేలిందట. రవిచంద్రపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు రెడీ అవుతున్నారట.
ప్రస్తుతం ఈ తప్పుడు జీవోల అంశం మొత్తం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. ఎన్నికల సంఘం ఈ 10 లేదా 15 రోజులలోనే చర్యలకు ఉపక్రమించేందుకు కూడా అవకాశం కనిపిస్తున్నది. ఈ వ్యవహారంలో ఎంత మంది పాత్ర బయటపడుతుందో... చివరకు ఎవరి పీకల మీదకు తెస్తుందో అన్న ఆందోళన టీడీపీ నేతల్లో నెలకొంది.