రాజకీయాల్లో ఒకప్పుడు సినీగ్లామర్ పని చేసేదేమో గాని ఇప్పుడు ఆ రోజులకు కాలం చెల్లిపోయింది. తెరమీద హీరోలుగా ఉన్న వారిని రాజకీయాల్లో హీరోలను చేస్తారనుకుంటే పొరపాటే. ఎంత సినిమా స్టార్ అయినా ప్రజల్లో లేకపోతే మట్టికరవకతప్పదు. గతంలో సినిమా రంగంలో మహామహులే ఓడిపోయిన పరిస్థితి. తెలంగాణలో సినిమా వాళ్లకు ప్రజాక్షేత్రంలో పెద్దగా క్రేజ్ లేదు. ఏపీలో ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి కొందరు సినిమా స్టార్స్ పోటీ చేశారు. చాలా మంది సినిమా వాళ్లు ఎన్నికల వేళ ఏదో ఒక పార్టీ నుంచి కండువా కప్పించేసుకున్నారు. కొందరు తమకు తెలిసిన సినిమా వాళ్లను తీసుకువచ్చి ప్రచారం చేయించుకున్నా వారి వల్ల పోటీచేసిన వాళ్లకు కలిసొచ్చిందేమీ లేదు.
ఇదిలా ఉంటే ఏపీలో ఈ ఎన్నికల బరిలో ఉన్న సినీ స్టార్స్లో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి, చిరంజీవి తమ్ముడు నాగబాబు నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. వీరిలో బాలకృష్ణ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, రోజా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ నలుగురిలో రోజా నగరిలో గట్టి పోటీ ఇచ్చారు. ఆమె చివరి యేడాది స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత, కలిసొచ్చే సామాజిక వర్గం, టీడీపీలో లుకలుకలు ఆమెకు ప్లస్.
ఇక హిందూపురంలో బాలయ్యకు ఈ సారి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. ప్రచారంలో సైతం తనకు పాజిటివ్గా వ్యాఖ్యలు చేసిన వారిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాలయ్యకు వ్యక్తిగత ప్రవర్తనే మైనస్గా మారుతోంది. ప్రచారంలో కొందరు అభిమానులు బాలయ్యకు ఈ సారి లక్ష మెజార్టీ వస్తుందన్న వ్యాఖ్యలపై గెలుపు కోసం కష్టపడుతుంటే మెజార్టీ అంటారేమిట్రా అని కొట్టేందుకు సైతం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ ఈ సారి అక్కడ సరిగా ప్లాన్ చేసుకుని ఉంటే బాలయ్య ఇప్పటికే ఓడిపోయేవాడు. అయితే అభ్యర్థి ఎంపికలో వైసీపీ చేసిన తప్పులు, బాలయ్య అక్కడ ఎవ్వరికి అందుబాటులో లేకపోవడం లాంటి విషయాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లలేకపోవడంతో ఇక్కడ చివర్లో అయినా బాలయ్య గట్టెక్కుతాడన్న ఆశలు ఉన్నాయి.
ఇక రెండు చోట్ల పోటీ చేసిన జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఎక్కడ గెలుస్తాడో ? గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి. పవన్ ముందుగా గాజువాకలో గెలుస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అక్కడ తాము గెలిపిస్తే రాజీనామా చేసి సొంత ప్రాంతం అయిన భీమవరాన్ని ఉంచుకుంటాడని భావించిన గాజువాక ఓటరు చివర్లో ట్విస్ట్ ఇచ్చాడని టాక్. ఇటు భీమవరంలో పవన్కు వైసీపీ క్యాండెట్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. రెండు చోట్లా పవన్కు వన్సైడ్గా అయితే ఎక్కడా తీర్పు వచ్చే పరిస్థితి లేదు. పవన్ రెండుచోట్లా ఓడిపోతే పరువు పోతుందని భావించిన సొంత సామాజికవర్గంలో కీలక నేతలు భీమవరంలో చివరి నిమిషంలో భారీ ఎత్తున డబ్బులు పంచినట్టు తెలుస్తోంది.
ఇక నరసాపురం ఎంపీగా పోటీ చేసిన పవన్ సోదరుడు నాగబాబు ప్రచారంలోనే చేతులు ఎత్తేసినట్టు తెలుస్తోంది. అక్కడ టీడీపీ, వైసీపీ అభ్యర్థులు అన్ని విధాలా స్ట్రాంగ్గా దూసుకువెళితే నాగబాబు ఏదో మొక్కుబడి ప్రచారంతో సరిపెట్టినట్టే వాతావరణం కనపడింది. ఏదేమైనా నాగబాబు చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాడని ముందే తెలిసిపోయింది. ఓవరాల్గా ఈ ఎన్నికల్లో ప్రజల్లో ఉన్న సినిమా వాళ్లకే తప్పా సినిమా గ్లామర్ను నమ్ముకున్న వారికి ప్రజలు పట్టం కట్టే పరిస్థితి లేదు.