గత కొద్దికాలంగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు కలిశారు. మర్యాదపూర్వక భేటీతో సరిపుచ్చుకున్నారు. ఆ ఇద్దరు నేతలే ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. హైదరాబాద్ వేదికగా ఈ సమావేశం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మనవరాలు వివాహం సందర్భంగా ఈ ముఖ్యులు పలకరించుకున్నారు. గత సంవత్సరంలో అమరావతిలో ఓ ఆలయ విగ్రహ ప్రతిష్టలో కలుసుకున్న వీరిద్దరూ మళ్లీ ఎదురెదురుగా తారసపడటం ఇదే తొలిసారి.
రామోజీ ఫిల్మ్సిటీలో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీ రావు మనవరాలు, దివంగత సుమన్, విజయేశ్వరిల కుమార్తె కీర్తి సోహన, వినయ్ల వివాహం జరిగింది. ఈ వివాహానికి ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, సినీ నటులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఇరువురూ ఒకేసారి ఎదురుపడడంతో చిరునవ్వులతో పలకరించుకున్నారు. వధూవరులను ఆశీర్వదించి, తిరుమల శ్రీవారి ప్రసాదాలను బహుమతిగా అందించిన చంద్రబాబు, వేదిక దిగగానే పవన్ కల్యాణ్ ఎదురు పడ్డారు. ఇరువురూ నమస్కార, ప్రతినమస్కారాలు చేసుకుంటూ మాట్లాడుకున్నారు.
ఇక ఈ వేడుకకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, సీవీసీ కేవీ చౌదరి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, లోకేశ్ దంపతులు, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తదితర ప్రముఖులు విచ్చేశారు.