ఓటమి ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోందని విపక్షాలు చేస్తున్న విమర్శలను నిజం చేస్తున్నట్లుగా...ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో ఊహించని వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. దేశఃలోనే సీనియర్ను అని ప్రకటించుకునే చంద్రబాబు ఆ అనుభవాన్ని పక్కనపెట్టి మరీ చిందులు తొక్కేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్గా నియమించి అప్పటి వరకు పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అనిల్చంద్ర పునేఠాను ఎన్నికల విధులతో సంబంధంలేని విధంగా బదిలీ చేయటం, రాష్ట్రంలోని మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల్లో జోక్యం చేసుకోవటాన్ని చంద్రబాబు తప్పుపట్టిన సంగతి విదితమే. అయితే, ఈ వివాదం మలుపులు తిరుగుతోంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకి ప్రతిపక్షనేత జగన్ అక్రమాస్తుల కేసులతో సంబంధం ఉందని, కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయని, సీఎస్లు ఎప్పుడైనా డీజీపీని కలిసిన సందర్భాలు ఉన్నాయా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అంతేకాదు ఎన్నికల ముందురోజు ఈసీ గోపాలకృష్ణ ద్వివేదీ తీరుపై కూడా చంద్రబాబు తీవ్ర అసహనంతో మండి పడ్డారు. దీంతో ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సారథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఐఏఎస్లు చంద్రబాబు బ్యూరోక్రాట్లపై చేస్తున్న ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయటంతో పాటు ఎల్వీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఈనెల 23న సమావేశం నిర్వహిస్తున్నారు.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం, ఎల్వీ, ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఈనెల 23న సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని రిటైర్డ్, వర్కింగ్ ఐఏఎస్లను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.