ఆంధ్రలో ఎన్నికలు ముగిసిన తరువాత పవన్ మీడియా ,ముందుకు వచ్చి నోరు విప్పింది లేదు. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు టీడీపీ-వైసీపీ విజయం మాదంటే మాది అని చెప్పుకుంటున్నారు. కానీ పవన్ ఇంత వరకు స్పందించలేదు. ఇక తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన ఎన్నికల ఫలితాలపై తనదైన శైలిలో స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


టీడీపీ, వైసీపీ లాగా జనసేన సీట్ల లెక్క వేయదని , జనసేనకు అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయని తాను చెప్పను అన్నారు పవన్ . కాకుంటే జనసేన చెప్పే మార్పు మొదలైందని, దాన్ని కొనసాగిద్దామని పవన్‌ అన్నారు. మార్పు ఎప్పుడూ చిన్నగానే మొదలవుతుందని, జనసేన ఎదిగే దశలో ఈ మార్పు ఎంతవరకు వెళ్తుందో తెలియదన్నారు. గుంటూరులోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో పవన్ సమావేశం అయ్యారు.


ఎన్నికల్లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు లేని వేళ కూడా ప్రజలతో మమేకమవ్వాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలని సూచించారు పవన్ కళ్యాణ్. పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చెయ్యాలని ,గ్రామ స్థాయి నుంచి కొత్తతరం నేతలను తయారు చేయాలని పవన్‌ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే మార్పును ప్రజల్లోకి తీసుకెళ్దామని నేతలతో అన్నారు. తెలంగాణలోనూ ఇదే తరహా మార్పును ప్రజలు ఆహ్వానిస్తున్నారని, ప్రతి గ్రామానికీ ఒక రోజు కేటాయించి అందరినీ కలవాలని నేతలకు నిర్దేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: