తెలంగాణలో ఈసారి ఇంటర్ ఫలితాలు గందరగోళంగా మారాయి. ఫలితాల విషయంలో చోటు చేసుకున్న పొరపాట్లు కొంత మంది విద్యార్థుల ఆత్మహత్యలకి కారణమయ్యాయి. మరికొందరు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి విద్యార్థి సంఘాలు ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట నిరసనలకు దిగాయి.



విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ  "ఇంటర్ ఫలితాలకు సంబంధించిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ విచారణ జరిపి, మూడు రోజుల్లో నివేదిక ఇవ్వనుందని అన్నారు. సిబ్బంది తప్పు చేసినట్టుగా తేలితే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని అన్నారు. తప్పుడు మూల్యాంకనం చేసిన సిబ్బందికి రెండు వేలు జరిమానా విధించనున్నామనీ, ఈ జరిమానాను మరింత పెంచే ఆలోచన కూడా ఉందని స్పష్టం చేశారు. రీ వెరిఫికేషన్ లో సిబ్బంది వైపు నుంచి తప్పు జరిగిందని తేలితే, సదరు విద్యార్థులకు ఫీజు తిరిగి చెల్లించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యలకి పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. 



ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ ప్రెస్ మీట్ లో "ఇంటర్ బోర్డుపై వస్తున్న అపవాదు సరికాదు. పారదర్శంగానే మూల్యాంకనం చేశాం. కొన్ని చోట్ల పొరపాటు జరిగింది. ఓఎంఆర్ షీట్స్‌ బబ్లింగ్‌లో ఎగ్జామినర్స్ తప్పులు చేశారు. నవ్య విషయంలో 9 కి బదులు 0 ను బబుల్ చేశారు. ఇది చిన్న పొరపాటు కాదు. తప్పు చేసిన వారి వివరణ కోరాం. వారిపై చర్య తీసుకుంటున్నాం. చార్జ్ మెమోతో పాటు పెనాల్టీ వేస్తాం. 21 వేల పేపర్ల గల్లంతైన ప్రచారం అవాస్తవం. ఏ పేపర్ గల్లంతు కాలేదు. పోలీసుల నిఘా మధ్య పేపర్లు భద్రంగా ఉన్నాయి. సెంటర్ల మార్పు జరగడంతో ఆబ్సెంట్ విషయంలో గందరగోళం జరిగింది. అపోహలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాం" అన్నారు. 



సాంకేతిక కారణాలతో తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కొన్ని చోట్ల పొరపాట్లు జరిగాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ఓఎంఆర్ షీట్స్ బబ్లింగ్‌లో ఎగ్జామినర్స్ తప్పులు చేశారని వారందరిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఏ పేపర్ గల్లంతు కాలేదని.. పోలీసుల నిఘా మధ్య పేపర్లు భద్రంగా ఉన్నాయని వెల్లడించారు. విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికషన్, రీ వాల్యుయేషన్ చేయించు కోవచ్చని, జవాబు పత్రాలు చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు అశోక్. రీవాల్యుయేషన్ గడువు పొడిగింపుపై ఆలోచిస్తామని చెప్పారు.



మరోవైపు ఇంటర్ ఫలితాల్లో 'గ్లోబెరినా టెక్నాలజీ' పై వచ్చిన ఆరోపణలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. త్రిసభ్య కమిటీ జరపాల్సిన విచారణ అంశాలపై జీవో 41 జారీ చేసింది. ఒప్పందం ప్రకారం గ్లోబెరినా టెక్నాలజీ విధులు నిర్వహించిందా? లేదా? అన్న దానిపై ఈ కమిటీ పరిశీలన చేయనుంది. పూర్తి వివరాలు సేకరించి మూడ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది తెలంగాణ ప్రభుత్వం.


ఇంటర్ బోర్డు కాల్యాలయం వద్ద ఉత్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఫలితాల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శిని కలిసేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించటంతో ఉద్రిక్తత తలెత్తింది. సీఎం కేసీఆర్, కేటీఆర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.


ఇంటర్  ఫలితాల్లో గందరగోళాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళ‌న చేస్తున్న‌ విద్యార్థులు, తల్లిదండ్రులు.. ఆందోళ‌నాకారుల‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

మరింత సమాచారం తెలుసుకోండి: