ఊహించిందే జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ వీడనున్నారన్న ప్రచారం నిజమైంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్తో సమావేశమై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరింది.
భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి సహా ఆయన భార్య గండ్ర జ్యోతి, భూపాల్పల్లి డీసీసీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశామని తెలిపారు. భూపాలపల్లి జిల్లాను అభివృద్ధిలో ముందు వరసలో నిలిపేందుకు సీఎం కేసీఆర్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ప్రకటించారు.
కాగా, సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గండ్ర చేరిక ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, పొడెం వీరయ్య సై టీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు చేరితే కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం విలీనం కానుంది.