జాతీయ రాజకీయాలు మారుతున్నాయి. కీలక నేతలకు చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్ వేస్తున్న అడుగులు ఫలిస్తే.. బీజేపీ నేతలకు ఇబ్బందులు ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసుకున్న కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిలోనూ ఆయనను గద్దె దింపాలని నిర్ణయించుకుంది. రాహుల్ గాంధీ ప్రధాని అయినా కాకపోయినా.. మోడీ అధికారంలోకి రాకూడదనేది కాంగ్రెస్ వ్యూహం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అనేక రూపాల్లో పోరాటాలను ఉద్రుతం చేసింది. ప్రధానంగా నిన్న మొన్నటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ కుమార్తె , రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ తాజా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
అచ్చంగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ముఖకవళికలను పుణికి పుచ్చుకున్న ప్రియాంకకు ఇప్పటికే దేశంలోని అతి పెద్ద రాష్ట్రం యూపీలోని ఉత్తర ప్రాంత ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు.ఈ క్రమంలో ఆమె దూసుకుపోతు న్నారు. గడిచిన రెండు మాసాలుగా అంటే ఎన్నికల కోడ్ కూడా రాకుండానే ప్రచారంలో దిగిన ప్రియాంక తన సత్తా చాటుతున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా ఆమెను ప్రధాని మోడీపై పోటీకి దింపాలని కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఎదురు చూస్తోంది. దీనికి సంబంధించి మొదట్లో తటపటాయించిన ప్రయాంక తాజాగా మాత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓకే అంటే.. తాను మోడీపై పోటీకి దిగేందుకు రెడీ అని సంకేతాలు పంపడంతో కాంగ్రెస్లో దూకుడు కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో మోడీ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి అత్యంత పట్టున్న వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేసి దాదాపు 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన ఎంపీగానే కాకుండా ప్రధానిగా కూడా ఇక్కడ తనదైన ముద్ర వేశారు. రహదారుల విస్తరణ అంశం కొన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ నియోజకవర్గంలో రహదారుల విస్తరణకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, కొన్నేళ్లుగా మాటలకే పరిమితమైన గంగా నది ప్రక్షాళనను చేతల్లో చేసి చూపించారు. ఇటీవల ప్రియాంక గాంధీ గంగా నదిలో ప్రయాణించిన సందర్భాన్ని మోడీ ప్రచారాస్త్రంగా చేసుకుని తాను చేసిన అభివృద్ధి వల్లే గంగా నదిలో ప్రియాంక ప్రశాంతంగా విహరించారని ఆయన ట్వీట్ చేయడం గమనార్హం.
పైగా హిందూత్వ వాదానికి పెద్ద పీట వేసే ఈ నియోజకవర్గంలో మోడీకి జై కొడుతున్నవారి సంఖ్య గతంలో కన్నా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మోడీని ఎదిరించి నిలిచే నాయకుడు ఎవరూ కూడా కాంగ్రెస్కు కనిపించడం లేదు. లోకల్ పార్టీల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ నేపథ్యంలో ఇందిర వారసురాలిగా ప్రియాంకకు ఈ టికెట్ కేటాయించాలనే డిమాండ్ అటు పార్టీ పరంగాను వినిపిస్తోంది. దీనికి ప్రియాంక కూడా మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆమె కనుక వారణాసి నుంచి పోటీ చేస్తే.. మోడీకి ఇబ్బందేనని అనేవారుకనిపిస్తున్నారు. మరి ఆమె పోటీ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.