రాజకీయాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే అంశాలను అంచనా వేయడం అంత సులభం కాదు! వాటిని గుర్తించి విశ్లేషించగల కొందరు మాత్రం వాటిని అంచనా వేయడంలో విజయం సాధిస్తారు. రాజమండ్రి మాజీ లోక్ సభ సభ్యులు కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ కుమార్ కూడా ఈ వర్గీకరణలోకి తప్పకుండా వస్తారు. "తనకు వైసీపీ గెలవాలని ఉంటుంది" అనే విషయాన్ని బహిరంగంగానే అంగీకరించే ఉండవల్లి, ఈ ఎన్నికల్లో మాత్రం టీడీపీ, వైసీపీ మధ్య పోటీ నువ్వా? నేనా? అన్నంత తీవ్రంగా ఉందని వ్యాఖ్యానించారు.
1989 లో కాంగ్రెస్ గెలవబోతోందని, 1994 లో టీడీపీ గెలుస్తుందనే విషయం ఎన్నికల నాటికి అందరికీ స్పష్టంగా అర్థమైందన్న ఉండవల్లి, ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదని అన్నారు.
ఎన్నికలకు అతి సమీపంలో మహిళలకు తాము అందించిన "పసుపు కుంకుమ, వృద్ధులకు పెన్షన్ పెంచుతామని" చేసిన వాగ్ధానం తమను గెలిపిస్తాయని టీడీపీ - దాదాపు శాసనసభ నుండి వెళ్ళి ఒకటిన్నర సంవత్సరం జనం లోనే జీవిస్తూ వచ్చిన, వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన ప్రచారమే తమను గెలిపిస్తుందన్న నమ్మకంతో వైసీపీ- ఉందని ఉండవల్లి తెలిపారు.
అయితే ఇక్కడ కీలకాంశం వైసీపీ గెలుపు జనసేనకు వచ్చే ఓట్ల శాతం పై ఆధారపడి ఉంటుందని ఉండవల్లి విశ్లేషించారు. గత ఎన్నికల్లో కాపు ఓట్లు గంపగుత్తగా టీడీపీకి పడ్డాయన్న ఉండవల్లి, ఈసారి మాత్రం ఆఓట్లు టీడీపీకి పడే అవకాశం లేదని అన్నారు. అయితే ఆ ఓట్లు జనసేనకు ఏ మేరకు పడతాయనే దానిపైనే వైసీపీ గెలుపు ఓటములు ఆధారపడి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఒకవేళ కాపుల ఓట్లుకు మొత్తానికి మొత్తంగా జనసేనకు పడితే, అది అంతిమంగా మళ్లీ టీడీపీకి కలిసొచ్చే అవకాశం ఉందని, అలా కాకుండా కాపు ఓట్లను జనసేన, వైసీపీ పంచుకుంటే మాత్రం వైసీపీ విజయం సాధించడం ఖాయమని ఆయన ఉండవల్లి విశ్లేషించారు. ఒకవేళ టీడీపీ గెలిస్తే, ఎన్నికల చివర్లో ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో అధికారికంగా డబ్బు పంచే ట్రెండ్ మొదలవుతుందని ఉండవల్లి అన్నారు. ఇక ముందు కూడా పార్టీలు ఈ ట్రెండ్ ను అనుసరించే అవకాశాలే ఉంటాయని న అభిప్రాయపడ్డారు.